కుమ్రంభీం ఆసిఫాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్స్లో కంటి వెలుగు కార్యక్రమం సన్నాహక ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు దండే విఠల్, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కంటి సమస్యలు దూరం చేసేందుకు కృషి చేస్తుందని, ఈ నెల 18 నుంచి 100 రోజుల పాటు రెండో విడత కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 12లోగా మండల పరిషత్, మున్సిపాలిటీల్లో సమావేశాలు పూర్తి చేయాలని, శిబిరాలపై క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని కోరారు. ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అందుబాటులో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, కంటి అద్దాలు అందించడం జరుగుతుందని, శస్త్రచికిత్స అవసరం ఉన్న వారికి కంటి వెలుగు కార్యక్రమం తర్వాత తేదీని నిర్ణయించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంపై ప్రజలకు సర్పంచులు, ఎంపీటీసీలు అవగాహన కల్పించాలని కోరారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 950 వైద్యులను నియమించగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 255 మంది వైద్యులను కేటాయించినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు సమృష్టి విజయవంతానికి కృషి చేయాలని సూచించారు.