Minister KTR | హైదరాబాద్ నగరాన్ని భారతదేశంలో నెంబర్ వన్గా నిలబెట్టాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచన అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఎస్సార్డీపీ ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అన్నారు. ‘ముఖ్యమంత్రి ఆలోచనల్లో నుంచి 2014లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్ధమానమవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక మంచి విశ్వనగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం. ఇక్కడ ప్రజ అవసరాలకు, నగర విస్తరణకు, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని ఆలోచనతో సీఎం నడుం బిగించి ఎస్సార్డీపీ కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్ఎంసీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు అప్పగించారు. మాకు అప్పజెప్పిన 48 కార్యక్రమాల్లో భాగంగా శిల్పా ఫ్లైఓవర్తో కలిసి 33 కార్యక్రమాలను ఆరేళ్లలో పూర్తి చేశామని సగర్వంగా చెబుతున్నా’నన్నారు.
‘పరిశ్రమల మంత్రిగా చాలా నగరాలు, చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు తిరుగుతు ఉంటాను.. ఇతర నగరాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారంతా చెప్పే మాటక ఒకటే.. హైదరాబాద్లో ఉన్నంత అత్యుత్తమంగా మౌలిక వసతులు ఈ దేశంలో ఏ నగరంలో లేదని చెబుతున్నారు. ఢిల్లీ, బాంబే, చెన్నై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్ కానీ, పుణేకు వెళ్లినా.. ఇలాంటి అత్యుత్తమ మౌలిక వసతులు భారతదేశంలో ఏ నగరంలో లేవు అని.. మనది మనం కితాబిచ్చుకోవడం కాదు.. అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు, జాతీయ ప్రముఖులు చెబుతున్న మాట. పరిశ్రమలు, ఐటీ రంగం విస్తృతంగా పెరగడంతో ప్రతిఏటా లక్షల మంది హైదరాబాద్కు కొత్తగా వచ్చి స్థిరపడుతున్నారు. నగరం నలువైపులా విస్తరిస్తున్నది. పశ్చిమ హైదరాబాదే కాదు.. తూర్పు, ఉత్తరం, దక్షిణం నలువైపులా ఓఆర్ఆర్లో ఉన్నది అంతా జీహెచ్ఎంసీలో కలిసిపోయినట్టుగా విపరీతంగా విస్తరిస్తున్న విషయం అందరికీ తెలుసు. అందుకే ఎస్సార్డీపీయే కాదు. ఇందులో 8వేలకోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.
‘ఎస్సార్డీపీ ఫేజ్-2 తీసుకురాబోతున్నం. ఇందులో రూ.3500కోట్లతో మరిన్ని కార్యాక్రమాలు అమలు చేస్తాం. దీంతో పాటు సీఆర్ఎంపీ కార్యక్రమాన్ని తీసుకొని నగరంలో 710 పైచీలుకు మేయిన్ రోడ్స్ను ఎంత వర్షం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం. మేయిన్రోడ్స్పై రద్దీని తగ్గించేందుకు లింక్ రోడ్స్ అభివృద్ధి చేశాం. వాటికి చాలా అభినందనలు వస్తున్నాయి. ఇలా వ్యూహాత్మకమైన ఆలోచనతో సిటీ మాస్టర్ ప్లాన్, రేపటి అవసరాలు ఎలా ఉంటాయ్ అనే ఆలోచనతోనే ఇవన్నీ చేస్తున్నాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.