హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16, 17,18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయ న డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడురోజుల వజ్రోత్సవాల్లో భాగంగా 16న ర్యాలీలు, సభలు నిర్వహించాలని, 17న హైదరాబాద్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తారని తెలిపారు. జిల్లా, మండల, పంచాయతీ కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. 18న అన్ని జిల్లా కేం ద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని, అదేరోజు స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలను విద్యుద్దీపాలతో ముస్తాబు చేయాలని పేర్కొన్నారు. 17న హైదరాబాద్లో జరిగే ఆదివాసీ, బంజారాభవన్ల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్దఎత్తున గిరిజనులను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు.