హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని మెజార్టీ కాంగ్రెస్ నాయకులు సమర్ధించారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం (సీఎల్పీ) సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఖరి పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే జాగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడిన విషయం తెలిసిందే. టీపీసీసీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలపై వెంటనే స్పందించిన అధిష్ఠాన వర్గం నేతలు హుటాహుటిన శనివారం హైదరాబాద్కు చేరుకున్నారు.
గాంధీభవన్లో ఈ వ్యవహారంపై టీపీసీసీ కార్యవర్గంతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షునిపై చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డిని వివరణ కోరారు. పార్టీ అంతర్గత విషయాలు బాహాటంగా, మీడియా ముందు మాట్లాడటం నాది తప్పు అయితే, పార్టీ వేదికపై చర్చించకుండా రెండు నెలల కార్యాచరణను రేవంత్రెడ్డి ఏకపక్షంగా ప్రకటించడం తప్పు కాదా? అని జగ్గారెడ్డి అధిష్ఠాన వర్గం దూతలను నిలదీశారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదని మిగతా కార్యవర్గ సభ్యులు సమర్థించారు.
అయితే టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక్కరు మాత్రమే జగ్గారెడ్డి అలా మాట్లాడం తప్పు కాదా? అని ప్రశ్నించినట్టు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ను ప్రశ్నించే అధికారం ఉపాధ్యక్షుడికి ఉంటుందా? అని జగ్గారెడ్డి ఎదురు ప్రశ్నించడంతో అధిష్టానం వర్గం దూతలు ఎటు చెప్పలేక నీళ్లు నమిలినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీ వేదికపై కాకుండా మీడియా ముందు మాట్లాడటం పట్ల జగ్గారెడ్డి విచారణ వ్యక్తం చేయడంతో ఇక వివాదం ముగిసినట్టేనని ఈ వర్గాల సమాచారం. అయితే తనది తప్పని భావిస్తే జగ్గారెడ్డి విచారం వ్యక్తం చేస్తారు. మరీ రేవంత్రెడ్డిది కూడా తప్పే కదా? ఆయనేందుకు విచారణ వ్యక్తం చేయలేదని జగ్గారెడ్డికి మద్దతుగా నిలిచిన నాయకులు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ను ప్రశ్నించినట్టు తెలిసింది.