హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నిమ్స్ దవాఖానను అత్యాధునిక వైద్యపరికరాలు, సౌకర్యాలతో మరింత బలోపేతం చేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. నిమ్స్ కోసం అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు రూ.154 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో ‘రోబోటిక్ సర్జరీ’ యూనిట్ కీలకమైనదని, దీనికి రూ.18 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. రేడియోథెరపీ విభాగం అడిగిన రూ.20 కోట్ల విలువైన ‘లినాక్’ పరికరాన్ని మంజూరుచేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వ దవాఖానల్లో ‘రోబోటిక్ సర్జరీ’ అందుబాటులో లేదని గుర్తుచేశారు. నిమ్స్లో రూ.12 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్యపరికరాలు, ల్యాబ్లను మంత్రి హరీశ్రావు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, ఇతర వైద్యాధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు నిమ్స్లో రోగులను పలకరించి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నూతన వైద్యపరికరాలు, ల్యాబ్ల పనితీరు పరిశీలించారు.
రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేదలకు ఉచితంగా బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామని హరీశ్రావు తెలిపారు. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరోసర్జరీ తదితర వి భాగాల నుంచి కొత్త వైద్యపరికరాల కోసం వినతులు వచ్చాయని, వాటన్నింటినీ అందుబాటులోకి తెస్తామన్నారు. పుట్టుకతో వచ్చే జన్యువ్యాధులను గుర్తించి సవరించేందుకు ‘జెనెటికల్ ల్యాబ్’ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే ప్రభుత్వ వైద్యరంగంలో తొలిసారి ‘బోన్ డెన్సిటీ ల్యాబ్’ను ఏర్పాటుచేశామని, దీనితో ఎముక సాంద్రతను, పటిష్ఠతను పరీక్షించవచ్చని వివరించారు. రూ.2.5 కోట్లతో ‘న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్’ను సమకూర్చామని చెప్పారు. ‘మల్టీ డిసిప్లినరీ రిసెర్చ్ యూనిట్’ను కూడా నెలకొల్పామని, దీనివల్ల వైద్యులు, వైద్య విద్యార్థులు పరిశోధనలు చేయడానికి వీలుకలుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. ఒమిక్రాన్ ప్రాణాంతకం కాదని వైద్యనిపుణులు చెప్తున్నారని, అయినప్పటికీ ముందజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు.
ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు మాత్రమే భోజనం పెడుతున్నారని, పేమెంట్ కింద చికిత్స పొందేవారికి భోజనం పెట్టడం లేదని ఓ రోగి తన దృష్టికి తెచ్చినట్టు మంత్రి హరీశ్ తెలిపారు. ఇక నుంచి దవాఖానలో రోగులందరికీ ఉచితంగానే భోజనం అందించాలని దవాఖాన డైరెక్టర్ను ఆదేశించినట్టు చెప్పారు. రోగి సహాయకులకు రూ.5కే భోజనం అందించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరినట్టు వెల్లడించారు.