వరంగల్ : విజయవాడలో జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలు జాతీయ రాజకీయాలల్లో పెను మార్పులను తీసుకురానున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 18 వరకు విజయవాడలో జరుగనున్న సీపీఐ మహాసభలకు వెళ్లే ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలతో కూడిన ప్రత్యేక రైలును ఆయన వరంగల్ రైల్వే స్టేషనులో జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ 24 వ జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయని, తొలి రోజు బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, కార్మిక ,కర్షకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ మహాసభలు జాతీయ రాజకీయాల్లో పెను మార్పులను తీసుకురానున్నాయని వెల్లడించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, రాజ్యాంగ విలువల ధ్వంసంపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు.
మైనారిటీ వర్గాల పై దాడులు, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు లాంటి అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలపై మహాసభలలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, రాష్ట్ర నాయకులు టి. వెంకట రాములు, వరంగల్,హనుమకొండ జిల్లాల నాయకులు, కార్యకర్తలు విజయవాడకు బయలు దేరిన వారిలో ఉన్నారు.