హైదరాబాద్: ఆరోగ్యకరమైన హైదరాబాదే లక్ష్యంగా మరిన్ని వైద్య సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ అడుగులు వేస్తున్నది. మహానగరంలో మరో 32 బస్తీ దవాఖానలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా పురానాపూల్ కాసరట్టాలో ఏర్పాటు చేసిన బస్తిదవాఖానను (Basthi dawakhana) చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్తో కలిసి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ఉన్న గురుబ్రహ్మ నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్ జాతికి అంకితం చేశారు.
ప్రతి ఐదువేల నుంచి 10 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తున్నది. రెక్కాడితే కాని డొక్కాడని పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలను ఉద్దేశంతో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు 226 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. వాటిలో ప్రతిరోజూ సుమారు 20 వేల మందికి పైగా వైద్య సేవలు పొందుతున్నారు. 57 రకాల ఆరోగ్య పరీక్షలు జరుపుతూ 150 రకాల మందులు అందిస్తున్నారు.