కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ టెక్మహీంద్రా ఇన్ఫోసిటీ క్యాంపస్లో గురువారం సాయంత్రం జరిగిన ‘ఎక్స్యూవీ-400’ ఫార్ములా ఎడిషన్ జనరేషన్-3 రేసింగ్ కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, సినీ నటుడు రామ్చరణ్, మహీంద్రా గ్రూప్ ఈడీ రాజేశ్ జెజూరికర్,టెక్ మహీంద్రా ప్రతినిధులు సీపీ గుర్నానీ, వీంతా నయ్యర్ తదితరులు.
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా జహీరాబాద్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను తయారు చేయనున్నది. ఇందుకోసం ఇప్పటికే ఇక్కడున్న తమ వాహన తయారీ పరిశ్రమను విస్తరించనున్నది. ఇందులోభాగంగానే రూ. 1,000 కోట్ల పెట్టుబడితో లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుత ప్లాంటుకు అనుబంధంగా ఈ నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకున్నారు.
ఈ నూతన పరిశ్రమతో కొత్తగా 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కొత్త ప్లాంట్లో త్రీ, ఫోర్వీలర్ వాహనాలను తయారు చేయనున్నారు. కాగా, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రకటన తరువాత జరిగిన చర్చల్లో భాగంగానే మహీంద్రా అండ్ మహీంద్రా ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక భవిష్యత్తులో ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సంస్థ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జేజురికర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం జహీరాబాద్లో ఉన్న తయారీ ప్లాంట్ను విస్తరించడం ద్వారా మరిన్ని త్రీవీలర్లను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. తాజా పెట్టుబడితో ఎలక్ట్రిక్ త్రీవీలర్ల తయారీలో తమ స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
దేశంలో సస్టెయినబుల్ మొబిలిటీ రంగాన్ని మరింత వృద్ధిపరుస్తున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నేడు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న నాలుగు మెగా ఈవీ తయారీ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటి. మహీంద్రా అండ్ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ఇచ్చట ఉన్నాయి.
– రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు