సదాశివపేట, జనవరి 4: ప్రేమపేరుతో యువతి వెంటపడుతున్న ఓ యువకుడిపై ఆమె కుటుంబ సభ్యులు దాడి చేయగా.. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంటకు చెందిన మహేశ్గౌడ్ గ్రామంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. గత నెల 31న ఆ యువతి ఇంటి ముందు ముగ్గులు వేస్తుండగా తన సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు. దీన్ని గమనించిన యువతి తమ్ముడు.. మహేశ్గౌడ్ సెల్ఫోన్ను పగులగొట్టాడు.
ఇదే విషయాన్ని యువతి తండ్రి రాములుకు చెప్పడంతో.. ఆయన తమ అమ్మాయి వెంటపడొద్దని హెచ్చరించాడు. అయినా వినకుండా మరుసటి రోజు కూడా యువతి వెంటపడుతుంటే మహేశ్గౌడ్ను రాములు కొట్టాడు. గాయాలపాలైన మహేశ్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహేశ్గౌడ్ మద్యం తాగేవాడని, ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల మరణించాడా? లేక యువతి కుటుంబ సభ్యులు దాడి చేయడం వల్ల మృతి చెందాడా? అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.