హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహేశ్, లోకేశ్ అనే ఇద్దరు అబ్బాయిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. జీవితాంతం భార్యాభర్తలుగా కలిసి ఉండాలని నిర్ణయించుకొన్నారు. దీంతో మహేశ్ వింత ప్రతిపాదన చేశాడు. లోకేశ్ అమ్మాయిగా మారితే పెండ్లికి సిద్ధమని ప్రకటించాడు.
మహేశ్తో ఎంతో భవిష్యత్తును ఊహించుకొన్న లోకేశ్.. లింగ మార్పిడి చేయించుకొని, తన పేరును స్వీటీగా మార్చుకొన్నాడు. అనంతరం ఇద్దరూ ఆరేండ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత స్వీటీకి మహేశ్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. తనకు పిల్లలు కావాలని, అందుకు మరో పెళ్లి చేసుకుంటానని ఇటీవల స్పష్టం చేశాడు. దీంతో న్యాయం కోసం స్వీటీ మదనపల్లె రూరల్ పోలీసులను ఆశ్రయించింది. ఇన్నాళ్లపాటు సహజీవనం చేసిన మహేశ్తో తన పెండ్లి జరిపించాలని భోరున విలపించింది.