హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 23,816 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొన్నది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6,886 మంది, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 572 మంది ఉన్నట్టు తెలిపింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4,419 మంది, మహబూబ్నగర్ జిల్లాలో 3,339 మంది, హైదరాబాద్ జిల్లాలో 2,889 మంది, వికారాబాద్ జిల్లాలో 1,862 మంది, నాగర్కర్నూల్ జిల్లాలో 1,696 మంది, వనపర్తి జిల్లాలో 1,352 మంది, జోగులాంబ గద్వాల జిల్లాలో 801 మంది ఓటర్లు ఉన్నట్టు వివరించింది.
ఓటర్ల నమోదుకు ప్రత్యేక క్యాంపెయిన్
సాధారణ ఓటర్ల నమోదుకు సంబంధించి బుధవారం ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. జనరల్ ఓటర్ల నమోదు కోసం ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తామని చెప్పారు. బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. 2023 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన పౌరులు ఓటు కోసం నమోదు చేసుకోవచ్చని సూచించారు.