Maharashtra | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): బాబాసాహెబ్ అంబేదర్ నుంచి అన్నాహజారే దాకా ఈ దేశానికి గొప్ప చైతన్యాన్ని అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ నేడు ఆ రాష్ట్ర పరిస్థితులను చూస్తే బాధగా ఉన్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాత మారుద్దామని, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తేవడానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కృషి చేద్దామని ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం మహారాష్ట్రకు చెందిన పలువురు ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై సమీక్షించారు. పార్టీకి అనుబంధంగా పలు కమిటీల ఏర్పాటు, 288 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని గ్రామాలు, తాలూకాలు, జిల్లాల వారీగా బీఆర్ఎస్ శాఖల ఏర్పాటు, పార్టీని ప్రజల్లోకి తీసుకొనిపోయేందుకు అవసరమైన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గొప్ప సామాజిక, సాంసృతిక, రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో పరిపాలన రోజురోజుకూ దిగజారిపోతున్నది.
మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులు. వారి జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ అహర్నిశలు కృషిచేస్తున్నది. ఇప్పటికే.. బీఆర్ఎస్ మహారాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నది. అకడ పల్లెల్లో బీఆర్ఎస్ గురించి చర్చిస్తున్నారు. ప్రభుత్వాలను నడిపిన అకడి పార్టీలు వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయనే విషయాన్ని మరాఠీ ప్రజలు గ్రహించారు. అదే సందర్భంలో తెలంగాణ ప్రగతి మాడల్ వారిని అమితంగా ఆకట్టుకుంటున్నది. బీఆర్ఎస్ నిర్వహించిన ప్రతి సభను విజయవంతం చేస్తూ పార్టీ పిలుపులో భాగస్వాములవుతూ వారు కనబరుస్తున్న ఉత్సాహం గొప్పగా ఉన్నది. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినట్టుగానే నేడు మహారాష్ట్రలో ప్రజా స్పందన కనిపిస్తున్నది. ఇప్పుడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి వీస్తున్నది’ అన్నారు. మొదటి దశలో నాలుగు ముఖ్య నగరాలైన నాగపూర్, ఔరంగాబాద్, పుణె, ముంబైలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని స్థానిక నేతలు ప్రతిరోజు గ్రామగ్రామానికి వెళ్లి పార్టీ శాఖలను ఏర్పాటు చేయాలని, ఇందుకు అన్ని రకాల ప్రచార సామగ్రిని సిద్ధం చేశామని తెలిపారు. మహారాష్ట్రంలో ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వివిధ అంశాల్లో మహారాష్ట్ర శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు.
దేశంలో 20 శాతం ఉన్న దళితులను, సమాజంలో 50 శాతం ఉన్న స్త్రీలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయనంత వరకు ఈ దేశం ముందుకు సాగదని కేసీఆర్ తేల్చిచెప్పారు. దురదృష్టవశాత్తు 70 శాతం మంది నేడు అభివృద్ధికి దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. దళితులు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని, వారిలో 20 శాతం మంది వజ్రాల్లాంటివారున్నారని, వారిని సరైన పద్ధతిలో వినియోగిస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. మహిళలను వంటింటికే పరిమితం చేయటం వల్ల దేశం ఎంతో నష్టపోతుందన్నారు. వారికి కూడా అవకాశం కల్పిస్తే సమాజం తన గతిని మార్చుకుంటుందని చెప్పారు. రష్యాలో 95 శాతం మంది పైలట్లు మహిళలేనని, ప్రపంచంలో 70 శాతం దేశాలు మహిళలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నాయని తెలిపారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్కు విశేష ఆదరణ లభిస్తున్నదని, బీఆర్ఎస్ విధానాలకు ఎంతోమంది ఆకర్షితులవుతున్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ కంటే మహారాష్ట్ర వైశాల్యంలో, జనసంఖ్యలో, ఆర్థిక వనరుల్లో, ఇంకా అనేక రంగాల్లో అనేక రెట్లు పెద్దదని అన్నారు. దురదృష్టవశాత్తు నేడు మహారాష్ట్ర అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఇలా ఎందుకు అయిందో ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి గులాబీ సైనికుడిపై ఉన్నదని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ సహా తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ మహారాష్ట్రలోనూ అమలు చేస్తామనే విశ్వాసాన్ని కల్పించాలని దిశానిర్దేశం చేశారు. నాందేడ్, కంధార్-లోహ, ఔరంగాబాద్లో బీఆర్ఎస్ సభలకు విశేష ఆదరణ లభించిందని, దీన్ని జీర్ణించుకోలేని పార్టీలు, శక్తులు లేనిపోని అపోహలను సృష్టించే ప్రయత్నం చేస్తాయని, వాటిని ఎక్కడిక్కడ పటాపంచలు చేయాలని చెప్పారు. సమున్నత లక్ష్యం కోసం, దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ పుట్టిందని, కేవలం రాజకీయాల కోసమే కాదని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రపంచంలో ఏ దేశానికీ లేని మానవ వనరుల సంపద భారతదేశానికి ఉన్నదని, ఈ సంపత్తిని వినిగించుకునే జ్ఞానం పాలకులకు లేకుండా పోయిందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. సాగుభూమి, నీటివనరులు సహా అనేక రంగాల్లో భారత్కు పుష్కలమైన సంపద ఉన్నా దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలనే జ్ఞానం లేకపోవడం వల్లే దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని చెప్పారు. చైనా కుటుంబ నియంత్రణ విధానాలు, అశాస్త్రీయ ఆలోచనలు అమలు చేయటం వల్ల 60 శాతం మంది వృద్ధులున్న దేశంగా మారిపోయిందని, అలాగే జపాన్ జనాభా కూడా తగ్గిపోయిందని తెలిపారు. మన దేశంలో జనాభాకు కొదువలేదని, కానీ పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంవల్ల అద్భుతమైన మానవ సంపద వృధాగా పోతున్నదని పేర్కొన్నారు. మానవ సంపదను సరియైన పద్ధతిలో వినియోగించుకుంటే భారతదేశం అమెరికా, యూరప్ దేశాలను మించిపోతుందని చెప్పారు.
‘ఎవరూ నాయకులుగా పుట్టరు, తయారవుతారు. ఇప్పుడు మహారాష్ట్ర రాతను మార్చేందుకు కొత్తరక్తం రాజకీయాల్లోకి వస్తుంది. వారిని ఆహ్వానిద్దాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో కొత్తపార్టీ పుట్టినప్పుడు అందరూ వింతగానే చూస్తారు. ఆ పార్టీ సిద్ధాంతం, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధిని చూశాక మెల్లమెల్లగా ప్రజలు ఆ పార్టీ పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. అభిమానంతో ఆదరిస్తారు. మహారాష్ట్రలోనూ ఇప్పుడు అదే జరుగుతున్నది’ అని చెప్పారు. పార్టీ నిర్మాణంతోపాటు పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడగట్టడం అతిముఖ్యమైన అంశాలుగా స్వీకరించాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విస్తృతిలోనే దేశ వికాసం దాగి ఉందన్న విషయాన్ని ప్రజలకు, వారి భాషలో విడమరచి చెప్పాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైనే ఉందన్నారు.
ఈ నెల 5 నుంచి జూన్ 5 వరకు మహారాష్ట్రలో పార్టీ విస్తృతి, కమిటీల నిర్మాణం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ కార్యాచరణను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల రోజులపాటు పార్టీ విస్తరణపై దృష్టి సారించాలని చెప్పారు. గ్రామ గ్రామాన పార్టీ కమిటీలు వేయాలని, రైతు, విద్యార్థి, యువజన, మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి తొమ్మిది అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామస్థాయిని బట్టి ఆ కమిటీల్లో 9 మంది, 11 మంది, 15 మంది సభ్యులు ఉండేలా చూసుకోవాలని సూచించారు. రోజుకు కనీసం 5 గ్రామాల చొప్పున తిరిగి కమిటీలు వేయాలని, ఆ సమయంలో తెలంగాణ మాడల్పై ప్రజల్లో విస్తృత చైతన్యం కల్పించాలని చెప్పారు. పార్టీ ప్రచార సామగ్రి సిద్ధమైందని, మరాఠీ భాషలో పాటలూ రూపొందించామని వివరించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతున్నదని ఇందులో ఎవరికీ అనుమానం అక్కరలేదని చెప్పారు. మహారాష్ట్రలో అవినీతి రహిత, నీతివంతమైన పాలన అందించటమే బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు.
మతం.. ధర్మం.. జాతి పేరుతో రాజకీయాలు చేసి రాజకీయ పరమార్థాన్ని మార్చివేస్తున్న దుర్మార్గ విధానాలు పోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఎలా గెలవాలనే దానిపైనే దృష్టిపెడుతున్నాయి తప్ప ప్రజలకు ఏం కావాలో ఆలోచించటం లేదని అన్నారు. ఈ దుస్థితి మారాలని, మార్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాల సుమన్, జోగురామన్న, బాపూరావు రాథోడ్, ఎంపీ బీబీ పాటిల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, మాహారాష్ట్ర బీఆర్ఎస్ ముఖ్యనేతలు మాణిక్ కదం, శంకరన్న దోండ్గే, మాజీ ఎంపీ హరిభావు రాథోడ్, మాజీ ఎమ్మల్యేలు చరణ్ వాగ్మారే, దీపక్ ఆత్రం తదితరులు పాల్గొన్నారు.
‘1987లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత అన్నాహజారే ఆలోచనలు, ఆచరణ తెలుసుకునేందుకు రాలేగాంసిద్దికి పోయిన. నీటి నిల్వ, నీటి వనరుల వినియోగం వంటి అనేక అంశాలను తెలుసుకున్నా. మహిళా చైతన్యం, అభివృద్ధిలో భాగస్వామ్యం చూసి ఎంతో నేర్చుకున్న. తెలియంది తెలుసుకోవటం తప్పుకాదు. అవకాశాలుండీ తెలసుకోకపోవడమే అజ్ఞానం. మహారాష్ట్రలో ‘మొహందారి-వన్ధరి’లో అప్పుడే నేను వైకుంఠధామాలను చూసిన. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి నేర్చుకున్న నేను అదే మహారాష్ట్రకు చెప్పాల్సి వస్తున్నది’ – కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమతా సిద్ధాంతాన్ని అమలు చేయటమే కర్తవ్యంగా ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. ‘బీఆర్ అంబేద్కర్ విశ్వమానవుడు. మనకు స్ఫూర్తిదాత. అంబేద్కర్ ఆశించిన సమాజాన్ని నెలకొల్పటమే బీఆర్ఎస్ లక్ష్యం’ అని అన్నారు. బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహాన్ని తాము షో కోసం ఆవిష్కరించలేదని, ఆ సమతామూర్తి సిద్ధాంతాన్ని ఆచరించటమే కర్తవ్యంగా భావించామని కేసీఆర్ తేల్చిచెప్పారు. గాంధీ-అంబేద్కర్లు లేకపోతే తాను అమెరికాకు అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదని బరాక్ ఒబామా చెప్పుకున్న ఉదంతాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఉదహరించారు.