ఖలీల్వాడి, నవంబర్ 26: కాంగ్రెస్, బీజేపీ నేతలు మహారాష్ట్రలో అభివృద్ధిని పట్టించుకోకుండా తెలంగాణలో ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆ రాష్ర్టానికి చెందిన బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి పాల్పడి.. సీఎం పదవిని కోల్పోయిన అశోక్ చౌహాన్ తెలంగాణకు వచ్చి పాఠాలు నేర్పడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణలో అమలవుతున్న ఒక్క పథకాన్నైనా మహారాష్ట్రలో అమలు చేయని కాంగ్రెస్, బీజేపీ నేతలకు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. దమ్ముంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ అమలు చేసి చూపించాలని సవాలు విసిరారు.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన మహారాష్ట్ర పార్టీ కో-ఆర్డినేటర్ వల్యాల నగేష్ నేతృత్వంలో నాయకులు ఆదివారం నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించకుండా.. ప్రజల బాగోగులను పట్టించుకోకుండా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అశోక్ చౌహాన్ వంటి కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. మహారాష్ట్రలో ఆయనే గెలువడమే కష్టంగా ఉందని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్లు దొంగల ముఠాగా తయారయ్యాయని మండిపడ్డారు. తెలంగాణకే కాకుండా మహారాష్ట్రకు కూడా బీఆర్ఎస్ పార్టీ అవసరమని, సీఎం కేసీఆర్ చేస్తున్న ఆదర్శవంతమైన పాలన మహారాష్ట్రలో కూడా రావాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. అందుకే 170 గ్రామపంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని గుర్తు చేశారు. రైతులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు సచిన్ సొంటక్కే, సంతోష్ బోస్లే, సంతోష్ బోరా, మోసీన్ షేక్, హజీ షానవాజ బాగ్వాన్, భాస్కర్ మర్గల్, సుకుమార్ సిద్ధం, శుభమ్ పాటిల్, అజిత్ సొంకట్లే పాల్గొన్నారు.