Auto Drivers | హైదరాబాద్ సిటీబ్యూరో/కవాడిగూడ, జనవరి 7 (నమస్తే తెలంగాణ ): ‘మేమేం పాపం చేశాం.. సీఎంగారూ మా ఊపిరి తీయొద్దు.. మమ్మల్ని శత్రువులుగా చూడొద్దు.. మాకూ అండగా నిలువండి’ అంటూ రేవంత్రెడ్డిని ఆటో డ్రైవర్లు వేడుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని, ప్రభుత్వం తమ గోడు వినాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్-మహాధర్నా’ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ధర్నా లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్రెడ్డి.. మా ఆటో డ్రైవర్లను శత్రువులుగా చూస్తున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా మా ఉపాధి మేమే చూసుకొని ఆటో నడుపుకుంటున్నాం. మాకు ఉద్యోగాలు ఇప్పించండని మేం ఏనాడు ఏ ప్రభుత్వాన్ని కోరలేదు.
మా బతుకేదో మేం బతికాం. కానీ మేం నమ్మిన మా ఆటోని లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం సరైనది కాదు. ఇప్పటికే మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆనాడు ఉమ్మడి పాలకుల అనాగరిక విధానాలతో తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని.. ఇప్పుడు అవే విధానాలను అనుసరిస్తున్న రేవంత్రెడ్డి పాలనలో కూడా మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీకి ప్రభుత్వం డబ్బులు ఎలాగైతే చెల్లిస్తుందో.. అలాగే ఆటోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి, ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు రూ.15 వేల భృతి ఇవ్వాలని, ఆటో డ్రైవర్ల పోరాటాన్ని రాజకీయంగా చూడొద్దని..ఆకలి పోరాటంగా చూడాలని కోరారు.
సోమాజిగూడకు చెందిన ఆటో డ్రైవర్ సతీశ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ డిమాండ్ చేశారు. తక్షణమే సతీశ్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ‘సతీశ్గౌడ్ వాళ్ల నాన్న ఆటో డ్రైవర్. అతడు ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి మరణించాక ఆటో వృత్తిని సతీశ్గౌడ్ కొనసాగించి కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. తమ్ముళ్లు, చెల్లి, అమ్మను చూసుకుంటున్నాడు. చెల్లె పెండ్లి చేశాడు. ఆ కుటుంబం అంతా ఆటో మీదనే ఆధారపడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారిగా అతడి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఉచిత బస్సు స్కీంతో ఆటోలకు గిరాకీ లేదు. కుటుంబాన్ని పోషించే మార్గంలేక మనస్తాపం చెంది ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు’ అంటూ గద్గద స్వరంతో వివరించారు. సతీశ్ గాథను విన్న అక్కడి ఆటో డ్రైవర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసుల కళ్లు కూడా చెమ్మగిల్లాయి.
అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్సింగ్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కొట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆటో డ్రైవర్ల సమస్యను ప్రభుత్వం రాజకీయంగా చూడటం సిగ్గు చేటని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడేందుకు సీఎం రేవంత్రెడ్డికి సమయం లేదా? అని ప్రశ్నించారు. అనంతరం మృతుడు ఆటో డ్రైవర్ సతీశ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కనీస వేతన బోర్డు మాజీ చైర్మన్ పీ నారాయణ, టీఏటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్, హైదరాబాద్ టీఏటీయూ అధ్యక్షుడు నిరంజన్ పాల్గొన్నారు. మా ‘ఊపిరి’ తీయొద్దు!