మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 9 : బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలే మారిపోయినట్టు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీ శిల్పారామంలో బుధవారం టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మేళాను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. దివిటిపల్లి శివారులో నిర్మించిన ఐటీ కారిడార్లో స్థానికంగా ఉన్న 650 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్మేళా నిర్వహించినట్టు తెలిపారు. వచ్చే నెల 2న మరో 10 వేల ఉద్యోగాలకు మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 13న 450 డ్రోన్లతో జిల్లాస్థాయిలోనే అతిపెద్ద ఎయిర్ షో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, టాస్క్ డైరెక్టర్ ప్రదీప్రెడ్డి, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.