Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచనలు చేశారు. బుధవారం క్షేత్ర పరిధిలోని వివిధ ప్రాంతాలను అధికారులతో కలిసి పర్యటించిన ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రధానంగా ట్రాఫిక్, పార్కింగ్, మంచినీటి సరఫరా, క్యూలైన్ల నిర్వహణ, విద్యుద్దీకరణ, తాత్కాలిక శౌచాలయాలు, పాతాళగంగలో స్నానఘట్టాల వంటి ఏర్పాట్ల పనులు వేగవంతం చేయాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు వచ్చే జిల్లా యంత్రాంగానికి అవసరమైన వసతి ఏర్పాట్లతోపాటు విధుల్లో ఉండే సిబ్బందికి అల్పాహార వసతులను ప్రత్యేకంగా తెలుసుకున్నారు. అదే విధంగా సమాచార సూచిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలని సూచించారు.
మార్చి 1 నుండి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణకు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, వైదిక సిబ్బంది, పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రసిద్ధరావు, ఎస్ఐ లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.