నర్సాపూర్, ఆగస్టు 24: రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని చాముండేశ్వరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్ల పెంపు అమలుకు పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని, పాత పెన్షన్లను పెంచడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచకపోవడం సిగ్గుచేటని అన్నారు. కొత్తగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్రంలో 60 లక్షల పేద కుటుంబాల వారు ఉన్నట్టు తెలిపారు. పింఛన్ల పెంపు కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పెన్షన్ల పెంపు కోసం సెప్టెంబర్ 9న హైదరాబాద్లో మహాసభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. దీంతోపాటు 25 డిమాండ్లు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.