హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): మాట్లాడలేని స్థితిలో ఉన్న ఓ మానసిక దివ్యాంగురాలికి తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) అండగా నిలిచింది. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో రెండేండ్ల బిడ్డతో ఉన్న మతిస్థితిమితంలేని హర్షిత అలియాస్ హరిత రాజాను గరియాబాద్ జిల్లా సఖి వన్స్టాప్ సెంటర్ నిర్వాహకులు కాపాడారు. ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బిలాస్పూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో చికిత్స అందించారు. అయితే, భాషాపరమైన సమస్య తలెత్తడం, తెలుగు అంతంతమాత్రంగా మాట్లాడుతుండటంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఛత్తీస్గఢ్ న్యాయ సేవల ప్రాధికార సంస్థ సభ్య కార్యదర్శి టీఎస్ఎల్ఎస్ఏని అభ్యర్థించారు. వెంటనే స్పందించిన టీఎస్ఎల్ఎస్ఏ.. జూనియర్ అసిస్టెంట్ అనిల్కుమార్, మహిళా కానిస్టేబుళ్లు స్వాతి, వెన్నెల దేవిని అక్కడికి పంపించింది. వారు హర్షితను తీసుకొచ్చి సోమవారం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె బిడ్డను అమీర్పేట్లోని శిశువిహార్కు తరలించారు. హర్షిత వివరాలు తెలిస్తే 040-23446723 నంబర్కు కాల్ చేయాలని సూచించారు.