CM Revanth Reddy | మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఇంద్రవెల్లిలో 1981లో జరిగిన కాల్పులు తమ పార్టీ ప్రభుత్వ తప్పేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ ఆదివాసీ బిడ్డలను తుపాకీ తూటాలతో కాల్చి, వాళ్లు నేలకు ఒరుగుతుంటే.. రక్తం చిందుతుంటే నిస్సహాయులై చేతులు కట్టుకుని కూర్చున్నారని, అది అప్పుడు జరిగిన తప్పు అని సీఎం చెప్పారు. అయితే ఆ తప్పుకు తాను ఏనాడో క్షమాపణ కోరానని తెలిపారు. నాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలతోపాటు, ఇండ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకునే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సరిదిద్దడానికే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు. ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని చెప్పారు. అందులో భాగంగానే గూడేలకు రోడ్లు, తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధికి నిధులు, ట్రైకార్ నిధులతో విద్యార్థుల చదువు కోసం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని అన్నారు.
మరో 15 రోజుల్లో 15వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆడబిడ్డలను ఆదుకొనేందుకు, వారిని కట్టెలపొయ్యి కష్టాల నుంచి కాపాడేందుకు త్వరలో రూ.500లకే ఇంటింటికీ సిలిండర్ ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. లక్ష మంది ఆడబిడ్డలతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ చేతుల మీదుగా రూ.500లకే సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే ఇంటింటికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని పునరుద్ఘాటించారు. గత సంవత్సరం ఎవరెవరు ఎంతెంత కరెంట్ వాడారో.. ఆ లెక్కలు గట్టి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ స్తామని తెలిపారు. తుమ్మిడిహట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని, కుఫ్టీ, సదర్మాట్ ప్రాజెక్టులను కడుతామని, కడెం ప్రాజెక్టును మరమ్మతు చేస్తామని చెప్పారు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకోవాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. దేశం కోసం రాహుల్గాంధీ వేల కిలోమీటర్లు పాద యాత్ర చేస్తున్నారని, వారి నాయనమ్మ, తండ్రి దేశం ప్రాణాలిచ్చారని అన్నారు. అలాంటి గొప్ప నాయకుడు, ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధాన మంత్రి కావాలి అని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు.