నిజాంసాగర్, జూన్ 16 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయినిగా నిలిచిన నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలకు రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు ఆయకట్టుకు నీటి విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం 1.35 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. వానకాలం పంటలసాగుకు సమాయత్తమవుతున్న రైతులను ఎల్నినో ఆందోళనకు గురిచేస్తున్నది.
ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, బోరుబావులు, ఎత్తిపోతలు, చెరువులు, కుంటలు, ప్రధాన జలాశయాల కింద ముందస్తు పంటలు సాగు చేయవద్దని వాతావరణశాఖ సూచిస్తున్నది. ఆయకట్టు పంటలు గట్టెక్కాలంటే 9 టీఎంసీలు అవసరం. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1405 అడుగుల(17.80 టీఎంసీలు)కుగాను 1394.96 అడుగుల(6.80 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది. దీంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తారో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.