హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో బుధవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 18కల్లా దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది.
దాంతో తెలంగాణ అంతటా రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని, ఈశాన్య దిశ నుంచి చలిగాలులు వీచే అవకాశాలున్నాయని వివరించింది. 18 నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.