భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని అశ్వారావుపేటలో విషాదం నెలకొంది. ఓ ఇద్దరు ప్రేమికులు అశ్వారావుపేట బస్టాండ్లో కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. చంద్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామానికి చెందిన పొర్రొళ్ల జగ్గారావు(28) ఆటో నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు.. జగ్గారావు ఆటోలో చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రతి రోజు వెళ్లేవారు. ఈ క్రమంలో జగ్గారావు.. మాయర అనూష(14) అనే విద్యార్థిని మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనూష చంద్రుగొండ జడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతోంది.
అయితే సోమవారం మధ్యాహ్నం సదరు బాలిక పాఠశాలలోనే బ్యాగు వదిలేసి బయటకు వచ్చింది. అనంతరం జగ్గారావుతో కలిసి అశ్వారావుపేటకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం అశ్వారావుపేట బస్టాండ్లో కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు ఆగడంతో.. ప్రేమికులిద్దరూ బస్సెక్కి కూర్చున్నారు. అంతకుముందే వారు పురుగుల మందు సేవించారు. బస్సులోనే ఆ ప్రేమికులు వాంతులు చేసుకోవడాన్ని కండక్టర్ గమనించాడు. దీంతో బస్సు డ్రైవర్ నేరుగా బస్సును పోలీసు స్టేషన్కు తీసుకెళ్లాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన వారిద్దరిని అశ్వారావుపేట ఆస్పత్రికి పోలీసులు తరలించారు. చికిత్స పొందుతూ ప్రేమికులిద్దరూ మృతి చెందారు. ఆటోలో చిగురించిన వారి ప్రేమ ఆర్టీసీ బస్సులో ఆవిరైపోయింది.