హనుమకొండ: హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటుచేసుకున్నది. పెండ్లికి ఒప్పుకోవడం లేదని యువతి గొంతు కోశాడు ప్రేమోన్మాది. కాజీపేట మండలం కపిడికొండకు చెందిన శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమెది వేరే మతం కావడంతో అతడు మతం మార్చుకున్నాడు. అయితే వీరి పెండ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఆమె కూడా వివాహానికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో మంగళవారం రాత్రి యువతి ఇంటికెళ్లిన శ్రీనివాస్.. ఆమెపై కత్తితో దాడిచేశాడు. యువతి గొంతు, చేయి కోశాడు. అడ్డుకున్న ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన యువతిని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.