హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ)/మలక్పేట: సీఎం కేసీఆర్ పాలనలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నిండాయని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్ను రూ.20 కోట్ల నుంచి రూ.83 కోట్లకు పెంచారని గుర్తుచేశారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆయన హైదరాబాద్లోని దివ్యాంగుల సంక్షేమభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 5.51 లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3,016 చొప్పున ఏటా రూ.2 వేల కోట్లు పింఛన్గా ఇస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు నాలుగింతలు పెంచారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.36 కోట్ల విలువ గల సహాయ ఉపకరణాలను 40,845 మంది లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా అందించామని తెలిపారు. తెలంగాణ ప్రభు త్వం దివ్యాంగులకు విద్యాసంస్థల్లో 4%, ఉద్యోగాల్లో 5%, డబుల్బెడ్రూం ఇండ్లలో 5% రిజర్వేషన్లు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
నేడు లూయీ బ్రెయిలీ విగ్రహావిష్కరణ
లూయీ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా దివ్యాంగుల సంక్షేమభవన్లోని బ్రెయిలీ పారులో ఏర్పాటుచేసిన లూయీ బ్రెయిలీ కాంస్య విగ్రహాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ బుధవారం ఆవిష్కరిస్తారని వాసుదేవరెడ్డి తెలిపారు. ఆయన వెంట దివ్యాంగుల సహకార సంస్థ జేఎండీ శైలజ, జీఎం ప్రభంజన్రావు ఉన్నారు.