Medigadda Barrage |జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్లో భారీ శబ్దంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 21న మేడిగడ్డ బరాజ్ మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో భారీ శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి ఐదేళ్లు గడుస్తుండగా ఇప్పటి వరకు అనేక భారీ వరదలు వచ్చినప్పటికీ ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
ఈ క్రమంలో భారీ శబ్దంతో బ్రిడ్జి స్వల్పంగా కుంగడంపట్ల అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ శాఖ మహదేవపూర్ ఏఈఈ రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న బరాజ్పై మహారాష్ట్ర వైపు నుంచి 300 మీటర్ల దూరంలో భారీ శబ్దం వచ్చిందని, 7వ బ్లాక్లో 19, 21వ పిల్లర్ల మధ్య భాగం కొంత మేరకు కుంగిందని, శబ్దం వచ్చిన తర్వాత ఎల్అండ్టీ కంపెనీకి చెందిన ఫోర్మెన్ బిద్యుత్ దేబ్నాథ్తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించామని వెల్లడించారు. 20వ పిల్లర్ వద్ద కొంత వరకు కుంగి కనిపించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ 174/2023, యూ/ఎస్, ఐపీసీ 427, సెక్షన్ 3 పీడీపీపీ కింద కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే సైతం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. భద్రత దృష్ట్యా మాత్రమే బ్రిడ్జిపై నుంచి రాకపోకలను నిలిపివేసినట్టు వెల్లడించారు.