చిన్నకోడూరు/సిరిసిల్ల రూరల్, జూన్ 12: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలిగొన్నది. మద్యం మత్తులో రాంగ్రూట్లో వస్తూ కారును ఢీకొట్టగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్లకు చెందిన తాండ్ర పాపారావు (64), ఆయన భార్య పద్మ (58), కారు డ్రైవర్ గొంటి ఆంజనేయులు (48) దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై ఆదివారం జరిగింది.
నేరేళ్లకు చెందిన తాండ్ర పాపారావు -పద్మ దంపతులు కరీంనగర్లోని భగత్నగర్లో నివాసం ఉంటున్నారు. పాపారావు కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వీరి కొడుకు, కోడలు ప్రీతమ్రావు-అనూష అమెరికాలో ఉంటున్నారు. కరీంనగర్లో కారు మాట్లాడుకొని ఆదివారం హైదరాబాద్కు బయలుదేరారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మల్లారం స్టేజీ వద్ద లారీ డివైడర్ దాటి అటువైపుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
కారు.. లారీ ముందుభాగంలో ఇరుక్కుపోవడంతో పాపారావు-పద్మ దంపతులు, డ్రైవర్ ఆంజనేయులు అక్కడికక్కడే మరణించారు. సిద్దిపేట రూరల్ సీఐ జానకిరాంరెడ్డి, చిన్నకోడూరు ఎస్సై శివానందం, నంగునూరు ఎస్సై మహిపాల్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికితీసి, సిద్దిపేట దవాఖానకు తరలించారు. మృతురాలి సోదరుడు శ్రీనివాస్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.