ఉజ్జయిని మహంకాళికి బోనం.. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
ఆన్లైన్ సేవలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ) : నగరంలోని ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవార్లకు ఆన్లైన్లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసింది. గురువారం నగరంలోని అరణ్యభవన్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆన్లైన్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఆన్లైన్లో బుక్చేసుకొన్న భక్తులపేర ఆలయ నిర్వాహకులు అమ్మవారికి బోనాలు సమర్పించడంతోపాటు వారి గోత్రనామాలతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు. బోనంలోని బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు-కుంకుమ పోస్టు ద్వారా భక్తుల ఇండ్లకు పంపిస్తారని పేర్కొన్నారు. బియ్యాన్ని ఇంటివద్ద వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చన్నారు. ఈ నెల 16 నుంచి బోనాలు ముగిసే వరకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్లో బోనం సమర్పించేందుకు సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. టీ ఏపీపీ, ఎఫ్వోఎల్ఐవో, మీ సేవ, ఆలయ వెబ్సైట్, పోస్టాఫీసు తదితర మాధ్యమాల భక్తులు ఈ సేవలను బుక్చేసుకోవచ్చన్నారు. దేశీయ సేవలకు రూ. 300, అంతర్జాతీయ సేవలకు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
జూలై 4లోపు అమ్మవారి ఆన్లైన్ కల్యాణం సేవలు
హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జూలై 5న వైభవంగా నిర్వహించనున్నట్టు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. 16 నుంచి జూలై 4లోపు భక్తులు అమ్మవారి ఆన్లైన్ కళ్యాణం సేవలను బుక్చేసుకోవాలని కోరారు. ఆన్లైన్ కల్యాణ సేవలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ ప్రాంతీయ పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి, తెలంగాణ అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.