కరీంనగర్ మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ధర్మపురి : కరీంనగర్లో ఈ నెల 3న పీఎంజే జ్యువెల్లరీలో జరిగిన దోపిడీ ఘటన రోజుకో నలుపు తిరుగుతున్నది. నెల రోజులుగా రెక్కీ నిర్వహించి.. దోపిడీకి పాల్పడినట్టుగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో గత నెలలో మూడుసార్లు బోగస్ ఆధార్ కార్డులు ఇచ్చి రూమ్లు బుక్ చేశారు. ఇక్కడి నుంచే దోపిడీకి రెక్కీ నిర్వహించారు.
ఈ నెల 1న ధర్మపురికి వచ్చి విజయలక్ష్మి వసతి గృహంలో రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. సౌరవార్ కుమార్, జార్ఖండ్ పేరుతో ఉన్న ఆధార్ చూపించారు. ఈ నెల 2న ముఠాకు చెందిన మరో వ్యక్తి హోటల్కు రాగా, గదిలో ఐదుగురు ఉండడానికి ఒప్పుకోమని లాడ్జి యజమాని గుండయ్య అభ్యంతరం చెప్పారు. ఏసీ గదులు ఖాళీ లేకపోవడంతో రూ.600 అద్దె చెల్లించి మొదటి అంతస్తులోని నాన్ ఏసీగదిని అదే సౌరవార్ కుమార్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. ధర్మపురి నుంచి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు వెళ్లే మార్గం ఉండడంతో పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నట్టు అనుమానిస్తున్నారు. చోరీలో ఇప్పటివరకు ఐదుగురు ముష్కరులు మాత్రమే పాల్గొన్నట్టు అనుమానించినా.. లాడ్జి వద్ద లభ్యమైన విరాలను బట్టి చోరీ ఘటనలో ఐదురుగు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో వ్యక్తి బయటి నుంచి సహకరించినట్టు అనుమానిస్తున్నారు.