నిర్మల్ : రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగా పంటను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం సొంత వ్యవసాయ క్షేత్రంలో పదెకరాల ఆయిల్ ఫామ్ సాగుకు మంత్రి దంపతులు మొక్కలను నాటి ఆయిల్ ఫామ్ సాగును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ పంటల సాగు ద్వారా రైతులు నష్టపోకుండా పంటల మార్పిడి విధానంలో భాగంగా ప్రధాన ఆహార పంట వరి, పత్తి, మక్కజొన్నలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఆయిల్పామ్ ప్రాజెక్టు పేరిట 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నట్లు తెలిపారు.
2022-2023 సంవత్సరంలో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నిర్మల్ జిల్లాలో 11,400 ఎకరాలు పామాయిల్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు పేర్కొన్నారు. మొదటి విడుతలో 3,400 ఎకరాలు, రెండో విడుతలో 7,980 ఎకరాల పామాయిల్ సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,784 ఎకరాల్లో మొదటి విడుత సాగుకు చేసేందుకు రైతులు ముందుకు వచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలు బిందు సేద్య పరికరాలు, అంతర పంటలకు విత్తనాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఆయిల్పామ్ సాగు పెరిగితే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుందని మంత్రి వివరించారు.