Telangana Budget | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 2024-25 ఏడాదికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందా? లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఏటా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు బడ్జెట్ సమావేశాలతో పాటు, వర్షకాల, శీతాకాల సమావేశాలను నిర్వహిస్తాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరిగే సమావేశాల్లో బడ్జెట్ను ప్రవేశపెడతాయి. కానీ, రాష్ట్రంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేదు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల అమలుకు నిధుల సమీకరణ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం ఒక అంచనాకు రాలేదు. వివిధ శాఖల్లో పూర్తిస్థాయిలో అధికారుల నియామకాలు జరుగలేదు.
శ్వేతపత్రాల విడుదలతోనే ప్రభు త్వం కాలం వెళ్లదీస్తున్నది. మరోవైపు ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చిలో జరగాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలు లేవని భావిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలు లేవని, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని, ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.