హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): నేటి టెక్నాలజీ యుగంలో జీపీఎస్ లేకుండా ఏ పనీ జరుగదు. అవసరమైన లొకేషన్ను తెలుసుకోవటానికే కాకుండా అనేక విధాలుగా జీపీఎస్ మనిషి జీవితంలో భాగమైంది. కానీ, ఇది చాలా ఖర్చుతో కూడిన సాంకేతికత. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన సులభ సాంకేతికతను హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీ పరిశోధకులు ఆవిష్కరించారు. లోరవాన్ టెక్నాలజీతో ఐఐఐటీ హెచ్ ప్రొఫెసర్ ఆఫ్తాబ్ హుస్సేన్ పర్యవేక్షణలో మాస్టర్స్ విద్యార్థి రిత్విక్ ముప్పాల ఈ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. జీపీఎస్ విధానంలో భూమిపై ఒక ప్రాంతాన్ని గుర్తించాలంటే 31 ఉపగ్రహాల సాయం అవసరం. లోరవాన్ టెక్నాలజీతో జీపీఎస్ అవసరం లేకుండా ట్రిపుల్ ఐటీలో లోకేషన్ను కచ్చితంగా గుర్తించినట్టు ప్రొఫెసర్ ఆఫ్తాబ్ హుస్సేన్ తెలిపారు. ఇందుకోసం నిరంతరం సంకేతాలు అందించే తక్కువ శక్తి ట్రాన్స్మీటర్లను వినియోగించినట్టు చెప్పారు. అత్యాధునిక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఇందులో ఉపయోగించామని వెల్లడించారు. ఈ టెక్నాలజీ పెటెంట్ కోసం దరఖాస్తు చేశామని చెప్పారు. భవిష్యత్తులో దీన్ని వ్యాపార అవసరాలకు విరివిగా వాడేందుకు అవకాశం ఉన్నదని రిత్విక్ ముప్పాల చెప్పారు.