తొర్రూరు, జూన్ 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపురంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి గ్రామస్థుల నుంచి నిరసనసెగ తగిలింది. పల్లెబాట, సీసీ రోడ్ల శంకుస్థాపనకు వారు శుక్రవారం ఫతేపురం రాగా, గ్రామంలో 21 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే ఒక దళితుడికీ ఇల్లు కేటాయించకపోవడంపై దళితమహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తప్పించుకుంటారు? మాయమాటలు కట్టిపెట్టండి’ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఝాన్సీరెడ్డి పోలీసుల భద్రత నడుమ హుటాహుటిన కారెకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఫతేపురంలో 600 దళిత గడపలున్నా ఒకరికీ ఇల్లు ఇవ్వకపోవడం అవమానకరమని పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపులో వివక్షను తీవ్రంగా పరిగణిస్తామని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.