హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ క్యాడర్గా గుర్తించే ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలను జారీచేసింది. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడినందున రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జీవో 124ను రూపొందించారు. దీన్ని అనుసరించి అన్నిశాఖల ఉద్యోగులు, క్యాడర్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా శుక్ర, శనివారాల్లోనే విద్యాశాఖకు సంబంధించి రాష్ట్ర సర్కారు 4 జీవోలను జారీచేసింది. గతంలో ఎంఈవోలు, డైట్ లెక్చర్లర్లకు సంబంధించి జీవో -158ను జారీచేయగా.. తాజాగా ప్రభుత్వ, పీఆర్ టీచర్ల క్యాడర్ను ఖరారుచేస్తూ జీవో నంబర్లు 254, 255, 256ను జారీచేశారు. మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్తు హెచ్ఎంలను సైతం ప్రభుత్వ పాఠశాలల్లోని హెచ్ఎంలతో సమానంగా మల్టీజోనల్ పోస్టుగా గుర్తిస్తూ శనివారమే జీవో 256ను సవరించి 257ను జారీచేసింది. దీంతో ఏకీకృత సర్వీస్రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయినట్టేనని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు.
కీలక ముందడుగు
జిల్లా పరిషత్తు ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్గా గుర్తించడం కీలక ముందడుగు. ఇందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని గ్రేడ్ -2 హెచ్ఎం పోస్టులను వర్గీకరించకపోవడంతో కాస్త సందిగ్ధత నెలకొన్నది. దీనిపై పీఆర్టీయూ తరఫున సీఎస్కు విన్నవించిన వెంటనే.. ఆ జీవోను సైతం ప్రభుత్వం జారీచేసింది. ప్రతిష్ఠంభనకు తెరపడింది.
అడ్డంకులు తొలిగాయి
జిల్లా పరిషత్తు టీచర్లను లోకల్ క్యాడర్గా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, లోకల్ క్యాడర్ రీఆర్గనైజేషన్ పూర్తికావడంతో ఏకీకృత సర్వీస్రూల్స్ అమలుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్తు, ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏకీకృతం చేయవచ్చు. ఆ దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి.