హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): వ్యవసాయం కోసం అప్పులు చేసి, వాటిని కట్టలేక విలవిలలాడుతున్న రైతులకు ‘రైతు రుణ ఉపశమన కమిషన్’ అండగా నిలుస్తున్నది. అప్పుల్లో కూరుకుపోయిన సన్న, చిన్నకారు రైతులు ఆత్మహత్య చేసుకోకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఈ కమిషన్ను ఏర్పాటుచేసింది. దేశంలో ఇలా ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటుచేసిన రెండో రాష్ట్రంగా నిలిచింది. ఈ కమిషన్ మూడేండ్లుగా అప్పులు ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తులు లేదా బ్యాంకులతో మాట్లాడి వివిధరూపాల్లో రైతులకు ఉపశమనం కలిగిస్తున్నది. ఇప్పటివరకు 81 మంది లిఖితపూర్వకంగా ఈ కమిషన్ను ఆశ్రయించగా 35 మంది సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించారు. మిగతావి పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుత కమిషన్ గడువు ఈ ఏడాది మార్చితో ముగియగా.. రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది.
అండ ఎవరికి? దరఖాస్తు ఎలా?
వ్యవసాయం కోసం అప్పులు చేసిన ఐదెకరాల్లోపు (ఎస్టీలైతే 10 ఎకరాల వరకు) భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులు లేదా కౌలురైతులు వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ తీర్చలేని పరిస్థితుల్లో ఉండి, అప్పు ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తులు లేదా బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎక్కువైతే కమిషన్ను ఆశ్రయించవచ్చు. లేదా కొందరు వడ్డీవ్యాపారులు అప్పు తీర్చినా కట్టలేదని బుకాయించి తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకున్న సందర్భాల్లోనూ కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి మోసాలపైనా కమిషన్ దృష్టిపెడుతుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన డెయిరీ, పౌల్ట్రీ రైతులు కూడా కమిషన్ను ఆశ్రయించవచ్చు.
బాధితులు తగిన పత్రాలతో నేరుగా కమిషన్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనంలో మూడో అంతస్తులో కార్యాలయం ఉన్నది. లేదా రైతు తన వేదనను లిఖిత పూర్వకంగా రాసి పోస్ట్ చేయవచ్చు. దీనికి పట్టాదార్ పాస్బుక్, అప్పు పత్రాలను జతచేయాలి. tscdrhyd @gmail.com కు మెయిల్ చేయవచ్చు.