హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్హత ఉన్న మహిళా సంఘాలకు అడిగినంత వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తున్నది. మహిళలు తమ అవసరాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్లు, ఇతర ప్రైవేటు రుణ సంస్థల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారికి ఎంత అవసరం అయితే అంత రుణం అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది.
ఇతర రాష్ర్టాల్లో లోన్ యాప్ల వద్ద రుణాలు తీసుకొని, అధిక వడ్డీలు చెల్లించకలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇలాంటివి రాష్ట్రంలో జరగకుండా ముందుగానే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఇప్పటి వరకు మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.11 వేల కోట్ల రుణం అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకొనే రుణ వడ్డీని ప్రభుత్వమే మహిళలకు చెల్లిస్తున్నది. రుణాలు తీసుకొన్న మహిళలు కూడా తిరిగి సకాలంలో చెల్లిస్తుండటంతో బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి.
రూ.21 వేల కోట్ల రుణం
రాష్ట్రంలో 4.30 లక్షల మహిళా సంఘాలున్నాయి. వీటిలో దాదాపు 46 లక్షల మంది సభ్యులున్నారు. వీరికి ప్రతి మూడేండ్లకు ఒక సారి అయినా జీవనోపాధికి రుణం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నది. దీనిలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, స్త్రీనిధి ద్వారా కనీసం రూ.21 వేల కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించింది. వీటిని వచ్చే జనవరి చివరి కల్లా పంపిణి చేసేలా చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులు, ఉద్యోగులు, బ్యాంకర్లకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉన్నతాధికారులు సూచించారు.
రాష్ట్రంలో ఈ సంవత్సరం వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా రూ.18 వేల కోట్లు, స్త్రీనిధి ద్వారా మరో రూ.2800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.10,829 కోట్ల రుణాలను 1,80,246 సంఘాలకు రుణాలు అందించారు. గత సంవత్సరం ఇదే సమయానికి లక్ష్యంలో 80 శాతం చేరుకున్నారు. అయితే ఈ సంవత్సరం వివిధ కారణాలతో 60 శాతం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రుణ పంపిణీని వేగవంతం చేయాలని నిర్ణయించారు. మహిళా సంఘాలు తీసుకొన్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లిస్తుండటంతో ఎన్పీఏలు కేవలం రెండు శాతం లోపే ఉంటున్నాయి. దీంతో బ్యాంకులు కూడా మహిళా సంఘాలకు ఎంత రుణం అయినా ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని సెర్ప్ అధికారులు చెప్తున్నారు.
స్త్రీనిధి ద్వారా..
స్త్రీనిధి ద్వారా రూ.2,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 1,29,725 సంఘాలకు రూ.1,273 కోట్ల రుణాలు ఇచ్చారు. స్త్రీనిధి ద్వారా తీసుకునే రుణాలకు రుణ బీమాను వర్తింపచేస్తున్నారు. రుణం తీసుకొన్నవారు చనిపోతే రుణం మాఫీ అవుతుంది.