మహబూబ్ నగర్ : చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బడులను బాగు చేసేందుకు తమ సర్కారు ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన అన్నారు.
స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-22 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆరు అంశాల్లో మెరుగైన ప్రమాణాలు కలిగిన 30 పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ అవార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత శాతం ఉన్న జిల్లా కాగా నేడు అన్ని రంగాలతో పాటు విద్యారంగంలో సైతం ఊహించని ప్రగతి సాధించిందని తెలిపారు.
పాఠశాలల అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు -మనబడి ద్వారా రూ.7400 కోట్లు ఖర్చు చేసి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారని, సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నామని తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో పైలెట్ పథకం కింద అన్ని పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, ఇంకా ఎక్కడైనా స్థలం లేని చోట స్థలాన్ని గుర్తించి అనుసంధానంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.పేద విద్యార్థులు ఎక్కువగా చదివే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులంతా మెరుగైన విద్య కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.