కాలేయ మార్పిడితో కాపాడిన ఫేస్ దవాఖాన వైద్యులు
కొండాపూర్, ఫిబ్రవరి 7: తీవ్రమైన కామెర్లతో రెండు వారాలుగా కోమాలో ఉన్న ఓ మహిళను హైదరాబాద్ హైటెక్సిటీలోని ఫేస్ దవాఖాన వైద్యులు కాపాడారు. ఆరు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రాణాలు నిలబెట్టారు. దీంతో ఆమె వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. ఫేస్ దవాఖాన వైద్యుల కథనం ప్రకారం.. అక్యూట్ హెప్టిక్ ఫెయిల్యూర్ (కాలేయ వైఫల్యం)తో బాధపడుతున్న సదరు మహిళ తొలుత వైరల్ హెపటైటిస్ బారిన పడటంతో స్థానిక వైద్యుల వద్దే చికిత్స చేయించుకొని మం దులు తీసుకొన్నది. సమస్య తీవ్రతరం కావడంతో ఫేస్ దవాఖానను ఆశ్రయించింది. వైద్యులు ఆమెకు వెంటనే పరీక్షలు నిర్వహించి వెంటలేటర్ సహాయంతో వైద్య సేవలందించారు. అయినా కాలేయం పూర్తిగా విఫలమవడం, మెదడు వాపు, రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలతో ఆమె కోమాలోకి వెళ్లింది. అనంతరం ఆమెకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ క్రమంగా ఒక్కో సమస్యను తగ్గించిన వైద్యులు.. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ఆమె 12 గంటల్లోనే కోమా నుంచి బయట పడిందని, కామెర్లు సైతం 10 రోజుల్లోనే తగ్గిపోయాయని వైద్యులు వెల్లడించారు.