‘కంటెంట్ బాగున్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో ‘లిటిల్హార్ట్స్’ విడుదల చేశాం. మా నమ్మకం నిజమైంది. ఈ సినిమాకు వచ్చే ప్రతి రూపాయి నాకు కోటి రూపాయిలతో సమానం. ఎందుకంటే నా బీవీ వర్క్స్ పతాకంపై విడుదలైన తొలి సినిమా ఇది. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్తో మరిన్ని చిత్రాలు చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా ఇండస్ట్రీలో పైకి రావచ్చనడానికి ఉదాహరణ హీరో మౌళి తనూజ్. డైరెక్టర్ సాయిమార్తాండ్తో ఓ సినిమా చేయాలనుకుంటున్నా’ అని బన్నీవాస్ అన్నారు. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయిమార్తాండ్ దర్శకుడు. ఆదిత్య హాసన్ నిర్మాత. బన్నీవాస్, వంశీ నందిపాటి ఇటీవలే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన థ్యాంక్స్ మీట్లో బన్నీవాస్ మాట్లాడారు.
‘ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు ప్రేక్షకులు వచ్చారంటే కారణం మౌళి తనూజ్. ఈ కథ థియేట్రికల్గా బాగుంటుందని నమ్మిన మొదటి వ్యక్తి తను. నిర్మాతలు అందించిన సపోర్ట్ వల్లే ఈ విజయం. బన్నీవాస్, వంశీ నందిపాటి విడుదల చేయడంతో సినిమాకు ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఈ సినిమా కలెక్షన్ల లెక్కలు వింటుంటే సంతోషంగా ఉంది.’ అని దర్శకుడు సాయిమార్తాండ్ అన్నారు. హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ ‘తొలిరోజే 2.5కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇది మా మూవీ బడ్జెట్ కంటే ఎక్కువ. రవితేజ ఫోన్ చేసి, తొలినాళ్లలో తాను చేసిన సినిమాలు గుర్తొచ్చాయంటూ అభినందించారు. నా అభిమాన హీరో నాని ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. ఇకపై మీ అందరికీ నచ్చే సినిమాలే చేస్తా’ అని తెలిపారు. ఒక్కొక్కరూ రెండుమూడుసార్లు ఈ సినిమా చూశామని చెబుతుంటే చాలా ఆనందంగా ఉందని కథానాయిక శివానీ నాగరం సంతోషం వెలిబుచ్చారు. ఇంకా వంశీ నందిపాటి, ఈటీవీ విన్ ప్రతినిథులు నితిన్, సాయికృష్ణ, నటీనటులు జయకృష్ణ, పద్మని, హరి నిఖిల్ కూడా మాట్లాడారు.