BC reservations | కంటేశ్వర్, సెప్టెంబర్ 11 : బీసీ రిజర్వేషన్లపై తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు రాక ఇబ్బంది పడుతున్నప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు.
అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు ఆమోదిస్తున్నామని చెప్తూనే అసెంబ్లీ బయట బీజేపీ ఎంపీలు బీసీ బిల్లు నుండి మైనారిటీలను తీసేస్తేనే బిల్లుకు ఆమోదం తెలుపుతామని చెప్పడం అనేది బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. బీసీ బిల్లులో ఎక్కడ కూడా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తామని తెలపలేదని బీసీ లోకి వచ్చే అన్ని వర్గాలకు బిల్లు అమలవుతుందని మాత్రమే తెలిపినట్లు వెల్లడించారు. కానీ ఆ మాత్రం కూడా తెలవకుండా మైనారిటీలకు బీసీ బిల్లు నుండి తొలగిస్తే బీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతామని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పడం చూస్తుంటే వారి అవివేకం బయటపడుతుందని పేర్కొన్నారు.
కేవలం మోడీ మెప్పు కోసం మాత్రమే రాష్ట్రంలో బీసీ బిడ్డలకు బండి సంజయ్, కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, కిషన్ రెడ్డి అగ్రకులానికి చెందిన వాడు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెప్తున్నాడని , కానీ బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ బీసీలకు రిజర్వేషన్ కల్పించడానికి ఎందుకు అడ్డుపడుతున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్డుపడటమే కాకుండా ఒక పిచ్చోడి మాదిరిగా మైనారిటీలను బీసీ బిల్లు నుండి తొలగిస్తేనే ఆమోదం తెలుపవుతామని చెప్పడం విడ్డూరంగా ఉందని, బీసీ బిల్లులు ఎక్కడ కూడా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రత్యేకంగా తెలుపలేదని మోహన్ రెడ్డి వివరించారు.
దేశంలో అందరికీ సామాన న్యాయం జరగాలని ఆలోచించే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కులగనన జరిపి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు. నిజంగా బీజేపీ నాయకులు బీసీ బిల్లును మద్దతు తెలుపుతూ ఎక్కడికక్కడ ఆ పార్టీ ఎంపీలు విలేకరుల సమావేశాలు నిర్వహించి బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
ఈనెల 15న కామారెడ్డిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పైన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారని, జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరూ ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించుకుని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించుకునే విధంగా ఈ నెల 15న నిర్వహించే సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, భీమ్గల్ మండల అధ్యక్షుడు బోదిరే స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ మహేష్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, లవంగ ప్రమోద్, ఈసా, అబ్దుల్ ఎజాజ్, సుభాష్ జాదవ్, సంగెం సాయిలు, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.