హైదరాబాద్, జూలై 22 : నెల ముగింపునకు వస్తున్నా రాష్ట్రంలోని హోంగార్డులకు ఇంకా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని హోంగార్డు సోదరుల ఆవేదన వినపడడం లేదా అని సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్రెడ్డిని ఆయన ప్రశ్నించారు. భద్రాది కొత్తగూడెం, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, జగిత్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో పని చేస్తున్న హోంగార్డులకు జీతాలు రాలేదన్న అంశాన్ని ఈ సందర్భంగా హరీశ్రావు ప్రస్తావించారు. నెల మొదలై 22 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు, చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంక్ అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరన్నారు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీరు మంత్రిగా ఉన్న హోంశాఖలోనే ఇలాంటి దుర్బర పరిస్థితి తలెత్తితే వారి ఆవేదన ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు, మాటల్లో ఫేకుడు, ఢిల్లీకి వెళ్లి జోకుడు ఇదేనా మీకు తెలిసిందన్నారు. వెంటనే హోంగార్డులకు వేతనాలు చెల్లించాలని, ప్రతి నెలా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.