Medaram Jathara | ములుగు, ఫిబ్రవరి19 (నమస్తేతెలంగాణ): మేడారం మహా జాతరలో మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు మద్యం అంటగట్టేందుకు ఎక్సైజ్ శాఖ అమ్మకాలకు టార్గెట్లు ఫిక్స్ చేసింది. కడ్లుండి గుడ్డి వారి వలె విధులు, నిబంధనలను గాలికొదిలి అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించే వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి తనివితీరా మొక్కులు చెల్లించిన అనంతరం పరిసర ప్రాంతాల్లో చుక్క, ముక్కకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఆకాశాన్నంటే ధరలకు మద్యాన్ని అమ్ముతూ వ్యాపారులు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు. వ్యాపారులు ఇచ్చే మామూళ్ల మత్తులో తేలాడుతూ ఎక్సైజ్ అధికారులు విధులను మమ అనిపిస్తున్నారు. దీనికి తోడు కల్తీ మద్యాన్ని సైతం భక్తులకు అంటగడుతున్నారు. స్పిరిట్ కలిపిన మద్యాన్ని యథేచ్ఛగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కల్తీ మద్యం తాగిన ఎందరో అనారోగ్యాల బారిన పడుతున్నారు.
తాడ్వాయి మండలంలో అధికారికంగా నాలుగు మద్యం షాపులే ఉన్నాయి. మేడారం జాతర పరిసర ప్రాంతాల్లో మాత్రం వందలాది బెల్ట్ షాపులు వెలిశాయి. మేడారంలోని మద్యం దుకాణంలో ఒక్కో బీరుకు, ఒక్కో క్వార్టర్ బాటిల్కు రూ.25 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. అది కూడా వారికి నచ్చిన, లాభాలు ఎక్కువ ఉన్న మద్యాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులు మాత్రం ఒక్కో క్వార్టర్కు, బీరుకు రూ.100 చొప్పున అదనపు ధరతో అమ్మకాలు సాగిస్తూ దోచుకుంటున్నారు.
జాతరలో మద్యాన్ని విక్రయించే వ్యాపారులు అధికారుల అండతో సిండికేట్ అవతారం ఎత్తారు. ఒక దగ్గర మద్యం ధర నచ్చక మరో బెల్ట్ దుకాణానికి వెళ్లిన భక్తుడికి నిరాశే ఎదురవుతున్నది. ఎమ్మార్పీ కంటే రూ.10 లేదా రూ.20 తీసుకోవాలి కాని ఇలా వంద చొప్పున అదనంగా పెంచి విక్రయాలు చేయడమేమిటని నిలదీసిన భక్తులకు న్యాయం జరగడం లేదు. దుకాణాదారుడు చెప్పిన ధరలకే మద్యం కొనాల్సి రావడంతో అధికారుల తీరుపై, జాతర నిర్వహణ, ప్రభుత్వంపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతరకు వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలను భక్తులు తరలించడానికి అనుమతి లేదని సంస్థ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తరలించకుండా భక్తులు సహకరించాలని కోరారు. జాతరలో విధులు నిర్వహించే 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో 2 వేల వరకు మేడారం జాతరకు వెళ్లనున్నాయి. దీంతో నగర ప్రజల ప్రయాణంపై ప్రభావం పడనున్నది.
హిమాయత్నగర్, ఫిబ్రవరి 19: హైదరాబాద్లోని హైదర్గూడలో ఉన్న ఎన్ఎస్ఎస్లో క్లీన్ మేడారం-సేవ్ మేడారం పేరిట ముద్రించిన వాల్పోస్టర్, క్లాత్ బ్యాగ్లను సోమవారం ప్రపంచ పర్యావరణ సంస్థ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ భద్ర ఆవిష్కరించారు. తాము ఉచితంగా లక్ష క్లాత్ బ్యాగ్లను భక్తులకు పంపిణీ చేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి నిఖిల్ సాయి, ప్రతినిధి మహేశ్ పాల్గొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు హెలికాప్టర్ సేవలు అందనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, బెంగళూరు తుంబీ ఏవియేషన్ సహకారంతో హెలిటాక్సీ సంస్థ బుధవారం నుంచి ఈ నెల 25 వరకు ఈ సేవలను అందించనున్నది. మేడారంలో 7 నిమిషాలపాటు ఆకాశం నుంచి జాతరను వీక్షేందుకు ‘జాయ్ రైడ్’ను కూడా హెలిటాక్సీ ఏర్పాటు చేసింది. హనుమకొండ-మేడారం-హన్మకొండ షటిల్ సర్వీసుల్లో ఒకరికి రూ.28,999 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. మేడారంలో వీఐపీ దర్శనానంతరం తిరిగి హనుమకొండలో దింపుతారు. మేడారంలో ఏరియల్వ్యూ (జాయ్ రైడ్) కింద 7 నిమిషాలపాటు ఆకాశంలో తిప్పేందుకు ఒకొకరికీ రూ.4,300 తీసుకుంటారు. ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన చాపర్లో హైదరాబాద్ నుంచి ఒకరికి రూ.95,833గా టికెట్ ధర నిర్ణయించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 7483432752, 9400399999 నంబర్లలో సంప్రదించాలని సంస్థ కోరింది.