ఆదిలాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు(MLA Rathod Bapurao) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో గురువారం తలమడుగు మండలానికి చెందిన 318, తాంసి మండలానికి చెందిన 12, భీంపూర్ మండలానికి చెందిన 164 మంది లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన(Tribals) బిడ్డలపై పెట్టిన అక్రమ కేసులను పూర్తిగా తొలగించడం అభినందనీయమని పేర్కొన్నారు. పోడు భూములు అందజేసినందుకు గాను ఎమ్మెల్యేతో కలిసి సీఎం కేసీఆర్ (CM KCR) చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సవర్గావ్, తాంసి, గోమూత్రి గ్రామాల వారికి దళితబంధు కింద మంజూరు అయిన భూములకు గాను 51 మందికి రూ. 67లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వీనర్లు తోట వెంకటేష్, నాగయ్య, తారుడి అరుణ్, ఎంపీపీలు శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీలు రాజు, గోక గణేష్ రెడ్డి, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.