అవాకులు చెవాకులు పేలిన నోళ్లన్నీ మూతపడేలా కాళేశ్వరం పంపులు జలగర్జన చేశాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణకు కాళేశ్వరం అవసరమేమిటో తెలియజెప్పేలా సోమవారం నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వర జలాలతో జలాశయాలన్నింటినీ నింపాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు అన్ని పంపులనూ ఆన్ చేశారు. లక్ష్మీబరాజ్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే జలాల తరలింపును చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో అధికారులు ఎత్తిపోతలను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. లింక్-1 లక్ష్మీ పంప్హౌస్లో ఆరు పంపుల ద్వారా 13.200 క్యూసెక్కుల నీటిని అన్నారంలోని సరస్వతి బరాజ్లోకి తరలిస్తున్నారు. అక్కడ లింక్-2లో నాలుగు పంపులతో 11.720 క్యూసెక్కుల నీటిని పార్వతీ బరాజ్లోకి, అక్కడి నుంచి నాలుగు మోటార్ల ద్వారా 10,440 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లికి చేరిన జలాలను ఒకవైపు ఎస్సారెస్పీకి, మరోవైపు రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు.
ప్రాణహితలో అంతకంతకూ పెరుగుతున్న వరద
గోదావరిలో ఎక్కడా వరద ప్రవాహాలు లేకపోయినా ప్రాణహితలో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం సగటున 6,500 వేల క్యూసెక్కుల వరద లక్ష్మీ బరాజ్(మేడిగడ్డ)కు చేరగా నీటి ప్రవాహాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆదివారం 12,500 క్యూసెక్కుల వరద రాగా, అది సోమవారం సాయంత్రం నాటికి 27,500 వేలకు పెరగడం గమనార్హం. వచ్చే మూడురోజుల్లో ఈ వరద మరింత పెరిగనున్నదని, గరిష్ఠంగా 76 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన లక్ష్మీబరాజ్ ప్రస్తుతం 5.5 టీఎంసీలకు చేరుకున్నది. అధికారుల అంచనా ప్రకారం రాబోయే వారం రోజుల్లోనూ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకొనే అవకాశమున్నది.
ఇప్పటికే ఎస్సార్ఆర్ నుంచి రంగనాయకసాగర్కు
ఇప్పటికే రంగనాయకసాగర్ రిజర్వాయర్ను నింపేందుకు పంపులను అధికారులు ప్రారంభించారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణ జలాశయంలో నీటిని తరలిస్తున్నారు. 3.5 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం అన్నపూర్ణలో 2.75 ఉండగా, పూర్తిస్థాయిలో నింపాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పంపింగ్ ప్రారంభించారు. రంగానాయకసాగర్లో మూడు టీఎంసీలకుగాను ఇప్పటికే 1.9 టీఎంసీలను నింపగా, పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకే ఒక పంపును ఆన్ చేసి 3200 క్యూసెక్కుల నీటిని రంగనాయకసాగర్కు తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు పంపింగ్ కొనసాగింది.