హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నెట్వర్క్, జూలై 23: మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వస్తున్న వరదకు తోడు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తుతున్నది. భారీగా వస్తున్న ప్రవాహంతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకొన్నాయి. 215 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీశైలం ప్రాజెక్టులో శనివారం నీటి నిల్వ 200 టీఎంసీలకు చేరుకోవడం, ఎగువ నుంచి వరద కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు డ్యాం గేట్లను ఎత్తివేశారు.
ఉదయం ప్రాజెక్టులోని 6, 7, 8వ క్రస్ట్గేట్లను పది అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కులను నదిలోకి వదిలారు. సాయంత్రానికి ఒక గేటు మూసి రెండింటి ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఎగువన జూరాలలోనూ పది గేట్లను ఎత్తి 40,600 క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు మళ్లీ వరద మొదలవ్వడంతో 10 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టే వదులుతున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని మూసీ డ్యాంకు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో అధికారులు ఏడు గేట్లను ఎత్తారు.
ఇటీవలే శాంతించిన గోదావరిలో మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి తిరిగి వరద క్రమంగా పెరుగుతున్నది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పాటు, ఒడిశా, చత్తీస్ఘడ్లో కురుస్తున్న వర్షాలతో ఇంద్రావతి, తాలిపేరు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో భధ్రాచలం వద్ద మళ్లీ గోదావరిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది.
ఎస్సారెస్పీ ఎగువ నుంచి, ప్రాణహిత నుంచి భారీ వరద రానున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్సారెస్పీ 9, సింగూరు 3, నిజాంసాగర్ 14, ఎల్ఎండీలో 20, ఎల్లంపల్లి, శ్రీరాజరాజేశ్వర జలాశయం, కడెం ప్రాజెక్టులతోపాటు, పార్వతి, సరస్వతి, లక్ష్మీ, సమ్మక్క బరాజ్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి వస్తున్న వరదను యథాతథంగా దిగువకు విడుదలకు చేస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీ నుంచి శ్రీరాజరాజేశ్వర(ఎస్సారార్) జలాశయానికి వరద జలాలు రావడంతో అధికారులు నీటి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మున్ముందు మరిన్ని వర్షాలు కురిసి వరద వచ్చే అవకాశమున్నందున, ముందస్తుగా ఆయా జలాశయాలను ఖాళీ చేసి వరదను ఒడిసిపట్టేందుకు ప్రణాళికలను రూపొందించారు. తొలుత మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కు జలాల తరలింపును శనివారం ప్రారంభించారు.
ఇప్పటికే మల్లన్నసాగర్లో 14.17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కొండపోచమ్మ జలాశయం నిల్వ సామర్థ్యం 15 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.14టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో మల్లన్నసాగర్ నుంచి మర్కూక్, అక్కారం పంప్హౌస్ల్లో రెండు చొప్పున మోటర్ల ద్వారా నీటి ఎత్తిపోతలను కొండపోచమ్మ రిజర్వాయర్కు తరలిస్తున్నారు. ఆదివారం రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణకు, అక్కడి నుంచి రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్నసాగర్కు నీటి ఎత్తిపోతలను చేపట్టనున్నారు.