హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైంగా, కొందరు ఫుల్ టైంగా ఉన్నారు. కానీ జయశంకర్ సార్ లైఫ్ టైం ఉద్యమకారుడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో దివంగత ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జయశంకర్ సార్ తన జీవితకాలం రాష్ట్ర సాధనకోసమే పని చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ప్రశంసించారు. జయశంకర్ ఆశయస్ఫూర్తికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన కొనసాగుతుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, నిజమాబాద్ డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, జక్క రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.