హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, ఏఐజీ దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డికి మరో అరుదైన గౌరవం లభించింది. వరల్డ్ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్(డబ్ల్యూఈవో) ఆయనకు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించిన చికిత్సా విధానాలు, కొత్త పద్ధతులను ఆవిష్కరించడంలో చేసిన కృషికి గుర్త్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు డబ్ల్యూఈవో అధ్యక్షుడు జీన్ ఫ్రాంకోయిస్ రే తెలిపారు. జపాన్లోని క్యోటోలో వచ్చే ఏడాది మే 14న నిర్వహించనున్న వరల్డ్ ఎండో కాంగ్రెస్లో అవార్డును ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్ నాగేశ్వర్రెడ్డ్డికి ఈ సంవత్సరం లభించిన అంతర్జాతీయ అవార్డుల్లో ఇది మూడోది. ఇప్పటికే ఆయన అమెరికన్ సొసైటీ ఆఫ్ జీఐ ఎండోస్కోపీ నుంచి రుడాల్ఫ్ షిండ్లర్ అవార్డు, అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏఏఎస్ ఫెలోషిప్ను అందుకొన్నారు. తనకు అంతర్జాతీయ స్థాయి అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉన్నదని, ఇది భారతీయ వైద్యులకు దక్కిన గౌరవమని డాక్టర్ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఈ అవార్డుల వల్ల ఏఐజీలో గ్యాస్ట్రో ఎంటరాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీకి మరింత ప్రేరణ లభిస్తుందని చెప్పారు.