దేశ ఆత్మగౌరవం కోసం భగత్సింగ్ ఏ స్థాయిలో పోరాటం చేశారో, అదే స్థాయిలో తెలుగునేల మీద అల్లూరి వీరోచిత పోరాటం చేశారు.
– రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రజలపై ఎక్కడైతే పీడన, దోపిడీ పెరుగుతుందో అక్కడ దైవాంశ సంభూతులైన మహామహులు ఉద్భవించి, వాటిని అంతం చేసి ప్రజలకు శాంతి చేకూరుస్తారు. అల్లూరి సీతారామరాజు అలాంటివారే.
– సీఎం కేసీఆర్
మంగళవారం గచ్చిబౌలిలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము, సీఎం కేసీఆర్.
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం దేశ ప్రజలకు నిత్యస్ఫూర్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ స్వాతంత్య్ర సమరంలో ఆయనది చిరస్థాయిగా నిలిచిపోయే పోరాటమని కొనియాడారు. దేశభక్తికి, త్యాగనిరతికి ఆయన నిలువెత్తు నిదర్శనమని శ్లాఘించారు. మంగళవారం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా, సీఎం కేసీఆర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. సమాజంలో వంచితులు, పీడితుల పట్ల చూపాల్సింది ఉత్త సానుభూతి కాదని, వారి అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. మన్యం వీరుడు అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించటం తన పూర్వజన్మసుకృతమని చెప్పారు. దేశం గర్వించదగ్గ వీరుడు అల్లూరి సీతారామారాజు అని కొనియాడారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా అల్లూరి జయంతి ఉత్సవాలను నిర్వహించటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 26 ఏండ్ల వయసులోనే అల్లూరి వీరమరణం పొం ది దేశ స్వాతంత్య్ర పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయారని కీర్తించారు. దేశ ఆత్మగౌరవం కోసం భగత్సింగ్ ఏ స్థాయిలో పోరాటం చేశా రో, అదే స్థాయిలో తెలుగునేల మీద అల్లూరి వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. నగరాలు, పట్టణాలు, మైదాన ప్రాంతాల్లో దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు జరిగితే, కొండకోనల్లో గిరిజనులు, ఆదివాసీలపై జరిగిన అఘాయిత్యాలపై అల్లూరి చేసిన తిరుగుబాటు అప్పటి బ్రిటిష్ పాలకులను గడగడలాడించిందని అన్నారు. పీడితుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించిన యోధుడు అల్లూరి అని కొనియాడారు. అల్లూరి సీతారామారాజు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాలోని ‘తెలుగు వీర లేవరా… దీక్షబూని సాగరా’ అనే పాటను రాష్ట్రపతి గుర్తుచేశారు. అల్లూరి వంటి దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తరాలు తమను తాము గొప్పగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. అల్లూరి జన్మించిన చింతపల్లిలో ధ్యాన మందిరాన్ని, మెమోరియల్ను నిర్మిస్తున్నామని చెప్పారు.
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చదుషృతాం
ధర్మ సంస్థాప నార్థాయ
సంభవామి యుగేయుగే
అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ చెప్పినట్టుగా ప్రజలపై ఎక్కడైతే పీడన, దోపిడీ పెరుగుతుందో అక్కడ దైవాంశ సంభూతులైన మహామహులు ఉద్భవించి వాటిని అంతం చేసి ప్రజలకు శాంతి చేకూరుస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు అల్లూరి సీతారామరాజు ఉదాహరణ అని పేర్కొన్నారు. బ్రిటిష్ కబంధ హస్తాల్లో చిక్కుకొని నలిగిపోతున్న భరతజాతిని విప్లవ జ్యోతి అయ్యి మేల్కొలిపిన వీరయోధుడు అల్లూరి అని కొనియాడారు. అన్నెంపున్నెం ఎరుగని మన్యం బిడ్డల కన్నీరు తుడిచి గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహా యోధుడని కీర్తించారు. ఆయన భరతమాత గర్వించే ఉత్తమ తనయుడు, నిర్మల దేశభక్తుడు, నిజమైన యోగి పుంగవుడు అని శ్లాఘించారు. ఆ మహనీయుని 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం యావత్ జాతి కర్తవ్యమని, ఈ కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించిన క్షత్రియ సేవా సమితిని అభినందిస్తున్నట్టు తెలిపారు.
నాడు సినీనటుడు కృష్ణ రూపొందించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా.. మా నిదురించిన పౌరుషాన్ని రగిలించిన వాడా’ అనే పాట చాలా పాపులర్ అయిందని, తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు తాను ఈ పాటను వింటూ స్ఫూర్తి పొందానని చెప్పారు. అల్లూరిది చాలా గొప్ప చరిత్ర అని, అంత చిన్న వయస్సులో అంత గొప్ప ప్రేరణ ఏ విధంగా కలిగిందోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అందుకే ఆయన్ను దైవాంశ సంభూతుడని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే గిరిజనుల అనుభవించే బాధలు చూడలేక యుద్ధరంగంలోకి దూకి కేవలం 26 ఏండ్ల వయసులోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించడం గొప్ప విషయమని అన్నారు. భారతజాతి గర్వంగా చెప్పుకొనే భగత్సింగ్, ఆజాద్, సుభాష్ చంద్రబోస్కంటే మేమేమీ తక్కువ కాదంటూ మన తెలుగు జాతిని నిలబెట్టి మనందరం గర్వించేలా చేసిన మహానీయుడు, త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. చనిపోయేటప్పుడు కూడా దేశం కోసమే ఆలోచించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు.
అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన మహాత్మాగాంధీ కూడా అల్లూరి సీతారామరాజును ప్రశంసించకుండా ఉండలేను అనడం అల్లూరి గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. అంగ్లేయులపై పోరాటానికి గిరిజనులను సంఘటితం చేసిన గొప్ప నాయకుడు అల్లూరి అని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు ఓ సాహసోపేత యోధుడు, ధైర్యశాలి అని ప్రశంసించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. అల్లూరి ఒక వ్యక్తి కాదని, శక్తి అని కీర్తించారు. అతడే ఒక సైన్యంగా పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీలు సంతోష్ కుమార్, దామోదర్రావు, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, జాజల సురేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్య, మర్రి జనార్థన్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కే నవీన్కుమార్, శంభీపూర్రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి , వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పెరిచెర్ల నాగరాజు, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హకీంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ముర్ముకు స్వాగతం పలికిన వారిలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు ఉన్నారు. అనంతరం ముర్ము అక్కడి నుంచి రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. అల్లూరి జయంతి ఉత్సవాల ముగింపు అనంతరం సాయం త్రం హకీంపేట విమానాశ్రయంలో మంత్రి సత్యవతి రాథోడ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తదితరులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.