బంగారాన్ని నగల దుకాణంలో అమ్మితేనే దాని విలువ తెలుస్తుంది. అదే బంగారాన్ని తుక్కు బజార్లో ఇనుప కడ్డీల పక్కనే పెట్టి అమ్మితే ఎట్లుంటది? కచ్చితంగా ఆ బంగారం విలువ పడిపోతుంది. దేశ ప్రజల నుంచి ఎంతో విశ్వాసాన్ని చూరగొన్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూడా ఇలాగే ఉన్నది. బంగారం లాంటి ఎల్ఐసీని భ్రష్టు పట్టించేందుకే కంకణం కట్టుకొన్నది. (గుండాల కృష్ణ)
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ): దేశీయ బీమా మార్కెట్లో నాలుగింట మూడు వంతుల వాటా కలిగిన ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం రచించిన కుట్రతో సంస్థ ప్రతిష్ఠ దిగజారుతున్నది. ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లోకి లాగడంతో దాని షేర్లు (వాటాలు) నిర్ధారించిన దాని కంటే తక్కువ ధరకు అమ్ముడుపోయాయి. ఫలితంగా లిస్టింగ్ అయిన తొలి రోజే రూ.1500 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదే రీతిన మొత్తం వాటాల విక్రయం కొనసాగితే ఏకంగా రూ.42 వేల కోట్ల నష్టాన్ని చవిచూడక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఎల్ఐసీని అనుక్షణం ఒడిదొడుకులు ఉండే స్టాక్ మార్కెట్లోకి ఎలా తీసుకొస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ‘బంగారు బాతు’ లాంటి ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం 22.13 కోట్ల షేర్లను విక్రయించి రూ.20,557 కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్ల ధరను రూ.949గా నిర్ధారించింది. పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్తో ఒక్కో షేరును రూ.889కి కేటాయించింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన తొలి రోజు ఈ షేర్లు మదుపరులకు లాభాలను ఇవ్వలేకపోయాయి. 8% తక్కువకు లిస్టు కావడంతో 22.13 కోట్ల షేర్ల మొత్తం విలువలో దాదాపు రూ.1500 కోట్లు తగ్గింది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు
ఎల్ఐసీ షేర్ల ధరను నిర్ణయించడంలోనే కేంద్రానికి ఓ ప్రాతిపదిక లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఒక సంస్థ వాటాల వాస్తవ విలువ కంటే 3-4 రెట్లు ఎక్కువగా లెక్కించి తదనుగుణంగా షేర్ల ధరను నిర్ధారిస్తారు. కానీ, ఎల్ఐసీ విలువను వాస్తవ విలువ కంటే 1.1 రెట్లు మాత్రమే ఎక్కువగా లెక్కించారు. దీంతో షేర్ విలువను ఎక్కువ నిర్ధారించాల్సి వచ్చింది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర సంస్థలు ఐపీవోకు వెళ్లినపుడు అనుసరించిన విధానాన్ని అవలంబించి ఉంటే ఎల్ఐసీ షేర్ విలువ ఇంతకంటే తక్కువగా ఉండేదని నిపుణులు చెప్తున్నారు.
ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఐపీవో వ్యవహారాల్లో మధ్యవర్తుల (బ్రోకర్ల) మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంటుంది. ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ఐపీవో వ్యవహారాల్లో మధ్యవర్తుల వ్యవస్థ ఉండకపోవడం వల్ల షేర్లు తక్కువకు లిస్టవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎల్ఐసీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థను స్టాక్ మార్కెట్లోకి లాగడమే చాలా పెద్ద తప్పిదమని కొందరు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎల్ఐసీ ఉత్పత్తి రంగ సంస్థ కాదు. ఉత్పత్తి రంగ సంస్థ అయితే బహిరంగ మార్కెట్లో చోటుచేసుకునే ధరల పెరుగుదల, ఇతరత్రా పరిణామాల ప్రభావం వాటిపై పడుతుంది. కానీ, ఎల్ఐసీపై ఇలాంటి ప్రభావాలు ఉండకపోవడంతో ఒడిదొడుకులు చోటుచేసుకోవు. అలాంటి సంస్థను అనుక్షణం ఒడిదొడుకులు ఉండే స్టాక్ మార్కెట్లోకి లాగడం వల్ల ప్రతికూల ఫలితాలే వస్తాయి.
కేంద్రం చర్యలు ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉంటున్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. షేర్ల విక్రయంలో లిస్టింగ్ రోజే ప్రతికూల ఫలితాలు రావడం వల్ల ఎల్ఐసీ ప్రతిష్ఠపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని, మార్కెట్లో ఎల్ఐసీ షేరు విలువ క్షీణిందన్న సంకేతాలు వెళ్లి పాలసీ హోల్డర్లు తగ్గే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. తద్వారా మారుమూల ప్రాంతాల్లో నిరుపేదలకు ఇచ్చే సూక్ష్మ రుణాలు కూడా తగ్గుముఖం పడతాయని హెచ్చరిస్తున్నారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్రం చేపట్టిన ఈ కుట్రతో ఎల్ఐసీ లాంటి సంస్థ బలహీనపడితే అది దేశంలోని సాధారణ ప్రజలకు నష్టదాయకమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగానే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. బలమైన ఎల్ఐసీ లాంటి సంస్థను ఒడిదొడుకులు ఉండే స్టాక్ మార్కెట్లోకి లాగి బలహీనపరచడం ఈ కుట్రలో భాగమే. దీని ద్వారా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం మార్గం సుగమం చేసుకొంటున్నది. ఎంత వారించినా వినకుండా కేంద్రం మొండిగా వ్యవహరిచడం వల్లనే ఎల్ఐసీ చరిత్రలో చీకటి అధ్యాయం లిఖితమైంది. మార్కెట్లో పరిస్థితులు బాగాలేవన్న నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా కేంద్రం ముందుకు సాగుతుండటం ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మోదీ సర్కారుకు ఉన్న కక్షపూరిత ధోరణిని స్పష్టం చేస్తున్నది.
– జీ తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి,ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్,హైదరాబాద్ డివిజన్