రాష్ట్రంలోని గ్రంథాలయాలను ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చే కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైన అన్ని పుస్తకాలను సమకూర్చుతూనే, విషయ నిపుణులతో ఉచితంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నది. సెమినార్లు, ఓరియంటేషన్ తరగతులను నిర్వహిస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులకు ఉచిత మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తున్నది. త్వరలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగతా గ్రంథాలయాల్లోనూ ఇదే తరహా సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
– వరంగల్/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ
వేలకు వేలు ఖర్చుపెట్టి పోటీ పరీక్షలకు శిక్షణ పొందలేని పేదవారి కోసం గ్రంథాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం వంటి గ్రంథాలయాల్లో ఉచిత శిక్షణ కొనసాగుతున్నది. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్, డిఫెన్స్, రైల్వే ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికీ తర్ఫీదునిచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలో 70 వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్రమంతటా ఉచిత శిక్షణ ఇప్పించాలని ఆలోచిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి, మంత్రి అనుమతి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్న వ్యక్తిత్వ వికాస నిపుణులు, రిటైర్డ్ ఉన్నతోద్యోగుల సహకారాన్ని తీసుకోవాలని యోచిస్తున్నారు. కొన్ని లైబ్రరీల్లో ఏసీ హాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఇంతకాలం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్న పుస్తకాలను మాత్రమే చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఉద్యోగార్థుల అభిరుచులు, అవసరాల మేరకు పుస్తకాలను తెప్పిస్తున్నారు. ఏ పుస్తకం కోరుకుంటే, ఆ పుస్తకాన్ని మార్కెట్ నుంచి తెప్పించి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దీనికోసం ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ను ప్రవేశపెట్టారు. ఈ సిస్టం ప్రకారం రిజిష్టర్లో ఉద్యోగార్థులు, పాఠకులు తమకు కావాల్సిన పుస్తకం పేరు రాస్తే, ఆయా పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంటే వారం, పది రోజుల్లోనే తెప్పిస్తున్నారు.
గతంలో 10 జిల్లా కేంద్ర గ్రంథాయాలు ఉండగా, వాటిని ప్రభుత్వం 33కు పెంచింది. వాటికి పాలకవర్గాలను సైతం నియమించింది. కోట్లాది రూపాయలు వెచ్చించి 15 గ్రంథాలయాలకు కొత్త భవనాలను నిర్మించింది. సికింద్రాబాద్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, పెద్దపల్లి, నిర్మల్, బడంగ్పేట, ఉప్పల్, సంగారెడ్డి, సదాశివపేట, వికారాబాద్, మహేశ్వరం, చెన్నూరులో వీటిని నిర్మించారు. కొత్తగా ఆసిఫాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరిలో కొత్త గ్రంథాలయ భవనాలను నిర్మించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి స్థల సేకరణ పూర్తయ్యింది. మండలస్థాయిలోనూ గ్రంథాలయ భవనాల నిర్మాణాన్ని చేపట్టగా పనులు ఊపందుకొన్నాయి. పలు గ్రంథాలయాలకు తెలంగాణ వైతాళికుల పేర్లను పెట్టారు. సిరిసిల్ల గ్రంథాలయానికి డాక్టర్ సీ నారాయణరెడ్డి, చెన్నూరు గ్రంథాలయానికి ప్రొఫెసర్ జయశంకర్, చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయానికి వట్టికోట ఆళ్వారుస్వామి పేరును పెట్టారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం కొన్ని జిల్లాల్లో దాతల సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాతృత్వంతో బువ్వకుండ పేరుతో గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు నిరంతరాయంగా ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నారు. దాతల సహకారంతో వికారాబాద్లో భోజనాన్ని అందజేయగా, అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం, అఫ్జల్గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో రూ.5కు భోజానాన్ని అందజేస్తున్నారు. దీంతో ఉదయమే గ్రంథాయాలకు చేరుకొంటున్న అభ్యర్థులు రాత్రి వరకు అక్కడే ఉండి చదువుకొంటున్నారు. ఉద్యోగార్థులు అధిక సమయంపాటు చదువుకొనేందుకు వీలుగా గ్రంథాయాల పనివేళలను పొడగించే అంశాన్నీ పరిశీలిస్తున్నారు.
పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న వారంతా గ్రంథాలయాలనే ఎంచుకొంటారు. వారికి కావాల్సిన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. వారు ఏది కోరుకుంటే వాటిని గ్రంథాలయాల ద్వారా అందజేస్తాం. ఉద్యోగాల నోటిఫికేషన్లు త్వరలోనే వెలువడే అవకాశముండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తాం. త్వరలోనే గ్రంథాలయ పరిషత్తు అధికారులతో సమీక్షిస్తాం. మొబైల్ గ్రంథాయాలను అందుబాటులోకి తీసుకురావాలన్న అంశాన్నీ పరిశీలిస్తున్నాం.
– సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖమంత్రి
రాష్ట్రంలోని గ్రంథాలయాలకు చారిత్రక నేపథ్యమున్నది. కొన్ని 1885 నుంచి సేవలందిస్తున్నాయి. వందేండ్లు దాటినవి 35 గ్రంథాలయాలున్నాయి. వర్తమాన అవసరాలకు తగ్గట్టు, పాఠకుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్టు గ్రంథాలయాలు సేవలు అందిస్తున్నాయి. ఏటా కోటికి పైగా నిధులు వెచ్చించి పుస్తకాలను కొనుగోలు చేస్తున్నాం. వీటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి ఎదగాలి.
-డాక్టర్ , అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు
వరంగల్లోని రీజినల్ లైబ్రరీ స్మార్ట్గా మారింది. భవనంతోపాటు పుస్తకాలు కొత్తగా మారాయి. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టు లైబ్రరీలోని పుస్తకాలన్నీ డిజిటలైజేషన్ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాదు.. లైబ్రరీకి వేసిన రంగులు విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. రూ.60 లక్షలతో భవనం ఆధునీకరణ పనులు చేపట్టగా, మరో రూ.45 లక్షలతో ఫర్నిచర్ కొనుగోలు చేశారు. లైబ్రరీలో ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కుర్చీలు, టేబుల్స్, బుక్ ర్యాక్స్, కంప్యూటర్లు, పిల్లల ఫర్నిచర్, ప్రత్యేకంగా లెక్చర్ హల్, సిట్టింగ్ సౌకర్యాలను కల్పించారు. భోజనం చేసేందుకూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కూడా గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పట్టినవారే. వాటి ప్రయోజనం ఏపాటిదో తెలిసిన ఆయన.. గ్రంథాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నారు. ఐఏఎస్ అధికారులు డాక్టర్ యోగితారాణా, కృష్ణభాస్కర్, బుర్రా వెంకటేశం తదితరులు తాము లైబ్రరీల్లో చదువుకొన్నవాళ్లమేనని ఎన్నోసార్లు చెప్పారు.