CPI Narayana | హైదరాబాద్, జూన్ 20 ( నమస్తే తెలంగాణ): రాజధాని లేని రాష్ట్రంగా, తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని సంగతేమో కానీ విశాఖపట్నం నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు లేఖ రాశారు. విశాఖ మాఫియా, సంఘ వ్యతిరేక శక్తుల అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో జరిగిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఏమీ చేయలేరని, కేంద్ర హోంశాఖే నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు.
ఒక ఎంపీ ఇంట్లో దుండగులు ప్రవేశించి మూడు రోజులు తిష్ట వేశారని, గంజాయి, మాదకద్రవ్యాలు వాడారని పేర్కొన్నారు. దుండగులకు, ఎంపీ సత్యనారాయణకు మధ్య అనేక వ్యవహారాల్లో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోవద్దని, వైసీపీ దీనిని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.